ఏపిలో తూర్పు కాపుల రిజర్వేషన్ల అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటం గ్రామ రైతులకు ఆదివారం ఆర్ధిక సాయం చెక్కులు అందించేందుకు గాను శనివారం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్బంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలతో సమావేశం అయ్యారు. కులం పేరు చెప్పుకుని నేతలుగా ఎదుగుతున్నారు గానీ ఆ కులం వారికి మాత్రం ఇబ్బందులు తొలగడం లేదని అన్నారు. తూర్పు కాపులకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మినహా ఇతర జిల్లాల్లో బీసీ రిజర్వేషన్ సర్టిఫికెట్ల జారీ లో ఇబ్బందులపై చర్చించారు. తూర్పు కాపుల నుండి ఒక మంత్రి, ఒక ఎంపీ, అయిదుగురు ఎమ్మెల్యేలు ఉండి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నామని ప్రశ్నించారు.
తెలంగాణలో అక్కడి పరిస్థితులను బట్టి రిజర్వేషన్ స్టేటస్ తసేశారు అంటే ఒక అర్ధం ఉంది కానీ ఎక్కడ ఏపీలో తూర్పు కాపులకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే ఒబిసీగా గుర్తిస్తూ ఇతర జిల్లాల్లో ఆ స్టేటస్ ఇచ్చి గుర్తించకపోవడం ఆశ్చర్యం కల్గిస్తొందని అన్నారు. ఉత్తరాంధ్ర నుండి తూర్పు కాపులు అన్ని జిల్లాలకు వలసలు వెళ్లారనీ, వారు ఎక్కడికి వెళ్లినా కులం మాత్రం మారదనీ, కానీ రాజకీయ ప్రాబల్యం ఉంటే తప్ప కుల సర్టిఫికెట్ వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
బీసీలు ఐక్యంగా ఉంటే రాష్ట్రాన్ని శాశించేది వాళ్లేనని పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పు కాపుల సమస్యల పరిష్కారానికి జనసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయ చైతన్యంతో… ఒకరిని ప్రాధేయపడే పరిస్థితి మార్చండని సూచించారు. కులానికో పదవి… రూ. 75 వేల జీతం ఇచ్చి నోరు మూయిస్తున్నారని ఆరోపించారు. కులంలో కొంత మంది చెంచాలు… కుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఘాటుగా విమర్శించారు. బీసీల్లో ఐక్యత లోపిస్తే కొంత మంది వ్యక్తుల సమూహానికి లొంగాల్సి వస్తుందని హెచ్చరించారు.