Janasena: తుది శ్వాస విడిచే వరకూ రాజకీయాలను వదిలివెళ్లనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో వివేకానంద వికాస వేదికపై ఏర్పాటు చేసిన యువశక్తి సభలో పెద్ద సంఖ్యలో విచ్చేసిన అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ముందుగా స్వామి వివేకానందుడి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ వయసు మళ్లిన తర్వాత చేతికర్ర కావాల్సి వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుందనీ, అలానే ఒక తరం వయసు పెరుగుతున్నప్పుడు భావితరం విలువ తెలిసివస్తుందన్నారు. ఇప్పుడు ఉన్న నేతలు ఎంత సేపు వారి కోసం, వారి బిడ్డల కోసం ఆలోచిస్తున్నారు కానీ ప్రజల కోసం ఆలోచించడం లేదని విమర్శించారు. నేను మీ అందరికీ ఇష్టమైన వ్యక్తిని కావచ్చు కానీ నేను సగటు మధ్యతరగతి మనిషిననీ, సామాన్యుడిని అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు.
ఈ రోజు తిట్టడానికి ఈ సభ పెట్టలేదనీ, తనకు ఉన్నదల్లా సగటు మనిషి తాలూకు ఆలోచనే అని పవన్ స్పష్టం చేశారు. ఈ దేశం కోసం నాకు ఎందుకు సహకరించదు, ఎందుకు నా కోసం నిలబడదు అని ప్రతి సగటు మనిషిలోనూ కోపం ఉంటుంది. నేను కూడా అలాంటి సగటు మనిషినే. నాలోనూ అలాంటి ప్రశ్నలే తలెత్తాయి, నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నా గురించి నేను చేసిన పోరాటం అంటే తొలి ప్రేమ నుండి ఖుషి సినిమా వరకూ మాత్రమే నని అన్నారు. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాననే విషయాన్ని వివరించిన పవన్ కళ్యాణ్.. ఇవేళ ప్రతి సన్నాసి చేత, ప్రతి వెధవ చేత మాటలు అనిపించుకుంటుంటే తనకు బాధలేదన్నారు.
ఇలాంటి వెధవలు, ఇలాంటి సన్నాసులతో మాట అనిపించుకోకుండా బతికేయగలననీ, తన చేతిలోనే జీవితం ఉందన్నారు. రాజకీయాల్లోకి రాకపోతే ఇలాంటి సన్నాసులు తన పక్కన నిలబడి ఫోటోలు కూడా తీయించుకుంటారని అన్నారు పవన్. ప్రజల పక్షాన పోరాడుతున్నప్పుడు తిట్టించుకోవడం తనకేమీ బాధ అనిపించదన్నారు. యువత ప్రశ్నించేందుకు భయపడుతున్నారనీ, ఈ విషయం ఇటీవల విజయనగరం జిల్లాలో టిడ్కో ఇళ్ల పరిశీలనకు వెళ్లినప్పుడు గమనించానని చెప్పారు. పోరాటాల గడ్డ అయిన ఉత్తరాంధ్రలో ప్రజలు మౌనంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఇక్కడ నుండి వలసలు ఎందుకు వెళ్లాలని ఆలోచించకపోతే ఎలా అని అన్నారు.
.గెలుస్తానో, ఉంటానో, ఓడిపోతానో తనకు తెలియదనీ, తనకు తెలిసింది అల్లా పోరాటం ఒక్కటేనని పవన్ అన్నారు పార్టీ పెట్టినప్పుడు తన వద్ద డబ్బులు పెద్దగా లేవనీ, కేవలం రూ.13 లక్షలు మాత్రమే ఉన్నాయన్నారు. అయినప్పటికీ వెనుకంజ వేయకుండా యాత్ర మొదలు పెట్టాననీ, ఎక్కడికక్కడ అంబేద్కర్ భవనాల్లోస, కల్యాణ మండపాల్లో బస చేసే వాడినని గుర్తు చేశారు. ప్రజల తరపున ప్రజల్లో ఒకడిగా పోరాడేందుకు రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. రోడ్డు మీద పడుకోవడానికైనా తాను సిద్దమేననీ, కావాలనుకుంటే ఈ క్షణమే సుఖాలను వదిలివేయగలనని అన్నారు. గత ఎన్నికల్లో సభలకు పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చినా ఓట్లేసే సమయానికి వదిలివేశారనీ, చట్టసభల్లో ఎదిరించి నిలబడేందుకు అవసరమైన సత్తా ఇవ్వలేకపోయారన్నారు. రెెండు చోట్ల ఓడిపాయావు అని కించపరుస్తుంటే దాన్ని యుద్దం తాలూకు గాయంగానే భావించాను తప్ప బాధపడలేదు, అవమానంగా భావించలేదన్నారు. .ఆశయం ఉన్న ఉన్నవాడికి ముందడుగే ఉంటుందని నమ్మే వాడినని పవన్ పేర్కొన్నారు.