కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించారు. బాధిత కౌలు రైతు కుటుంబాలకు పరామర్శించిన పవన్ కళ్యాణ్ .. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున 173 మంది కౌలు రైతులకు కోటి 73 లక్షలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిద్దవటంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ .. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కౌలు రైతులకు కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. సిద్దవటాన్ని చూసి ఇక్కడ తాను పుట్టింటే ఎలా ఉండేది అనిపించిందన్నారు. ఏపి లో టూరిజం కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నారు కానీ సిద్దవటం చాలా మంచి టూరిజం ఉన్న ప్రాంతమన్నారు. తెలుగు పద్యం రాయలసీమ లో పుట్టిందన్నారు. రాయలసీమ రైతులు ఆది బిక్షువు శివునికి కూడా అన్నం పెట్టే సత్తా ఉందని అల్లసాని పెద్దన రాశారన్నారు. పద్యం పుట్టిన నేలలో నేడు మద్యం ప్రవహిస్తొందని ఆవేదన వ్యక్తం చేశారు.
కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కు ఇవ్వడం వల్ల వారి సమస్యలు పూర్తిగా పరిష్కారం కావని తనకు తెలుసుననీ, ఉడతా భక్తి గా వారి కుటుంబాలకు లక్ష రూపాయలు ఇవ్వడమే కాకుండా వారికి అండగా జనసేన ఉందని భరోసా కల్పించడమే తమ లక్ష్యమని పవన్ తెలిపారు. అన్నం పెట్టే రైతుకు కులం చూడమన్నారు. 2018 లో రాయలసీమ లో పర్యటించిన సమయంలో చాలా మంది పెద్దలు కలిశారన్నారు. కులాల గురుంచి తాను ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. పేదరికానికి కులం లేదని చెప్పారు. వైసిపి ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి మేలు జరుగుతుందని భావిస్తున్నారని అన్నారు. కానీ కౌలు రైతుల కుటుంబాల్లో ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు.
జగన్ పేరు చెప్పడం తనకు ఇష్టం లేదన్న పవన్ కళ్యాణ్..జగన్ ఏపికి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదనీ, వైసిపికే ముఖ్యమంత్రి లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 60 వేల మంది కౌలు రైతులు రాయలసీమ లో ఉండగా, కొంత మందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఇచ్చారన్నారు. ఒక కులాన్ని జనసేన కు అంటగడుతున్నారని ఆరోపించారు. 2009 రాజకీయ ప్రస్థానం లో అన్నయ్య పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చాలా మంది మేధావులు ఉన్నారన్నారు. రాయలసీమ లో ప్రజా రాజ్యం కోసం లక్షల మంది నిలబడ్డారని గుర్తు చేశారు. ప్రజా రాజ్యాన్ని నిలబెట్టుకుని ఉన్నట్లయితే ఏపీ కి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ రాష్ట్రంలో మార్పు రావాలన్నారు.
వారసత్వ రాజకీయాలను అడ్డుకట్ట వేయాలనే కొత్త వారిని పార్టీలోకి తీసుకువస్తున్నామని చెప్పారు. మైదుకూరు లో ఒక దివ్యంగుడిని వైసీపీ నేతలు బెదిరించడానికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. బాధితుడు నాగేంద్రకు జనసేన అండగా ఉంటుందన్నారు. అన్నతో పాటు తిరిగాను అని చెప్పుకున్న వైఎస్ షర్మిలను జగన్ పక్కన పెట్టారని విమర్శించారు. సీఎం జగన్ సొంత బాబాయ్ చనిపోతే ఇంత వరకు నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి కేసులో పురోగతి లేదన్నారు. రాయలసీమలో మార్పు రావాలంటే పాలన మారాలన్నారు పవన్ కళ్యాణ్. కేంద్రం మెడలు వంచుతామన్న వైసిపి ఎంపీలు అక్కడికి వెళ్లి మొకరిల్లు తున్నారని పవన్ విమర్శించారు. జనసేన అధికారంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. మార్పు కోసమే జనసేన ప్రజల ముందుకు వచ్చిందనీ, ఒక్క సారి జనసేనకు అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ కోరారు.