Pawan Kalyan: ఇప్పటం గ్రామంలో సభ నిర్వహణకు సహకరించిన ఇప్పటం గ్రామానికి రూ.50 లక్షల తన ట్రస్ట్ తరపున ఇస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ సభ తాడేపల్లి మండలం ఇప్పటంలో ఘనంగా నిర్వహించారు. దామోదరం సంజీవయ్య వేదికగా నామకరం చేసి నిర్వహించారు. దామోదరం సంజీవయ్య స్పూర్తితో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అందుకే ఈ వేదికకు దామోదర సంజీవయ్య పేరు పెట్టి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రసంగానికి ముందు పలువురు జనసేన నాయకులు ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మాట్లాడుతూ జగన్ సీఎం అయ్యాకే ఏపికి అప్పులు, కష్టాలు ప్రారంభం అయ్యాయన్నారు. రాజకీయ దొంగలను మనమే ఎన్నుకుంటున్నామన్నారు.
ఏపిలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని అన్నారు. ఏపి రోడ్లపై కారులో వెళ్తున్నా పాడెపై వెళ్తున్నట్టే ఉందన్నారు. తాను మంచి సీఎంను చూశాను, చెడ్డ సీఎంను చూశాను, దుర్మార్గ సీఎంగా జగన్ ను చూస్తున్నానని విమర్శించారు. మళ్లీ జగన్ సీఎం అయితే ప్రజలు కాందిశీకుల్లా పొరుగు రాష్ట్రాలకు పోవాల్సి వస్తుందన్నారు నాగబాబు. రాజధాని లేకుండా మూడేళ్ల పాటు జగన్ రాష్ట్రాన్ని పరిపాలించారని అన్నారు. జగన్ రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేరన్నారు. మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లకుండా హైకోర్టు తీర్పును గౌరవించి అమరావతిలో రాజధానిని కొనసాగించాలని నాగబాబు సూచించారు.
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. పార్టీలో అందరికీ ప్రోత్సాహం, గౌరవం లభిస్తుందన్నారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించారు. మంచి పరిపాలన పవన్ కళ్యాణ్ ద్వారానే వస్తుందని అన్నారు. పార్టీ నేతలు హరిప్రసాద్, ప్రొగ్రామ్ కమిటీ చైర్మన్ కేకే తదితరులు ప్రసంగించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు.