Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు మీటింగ్ పెట్టినా అందరిలో ఒక ఆసక్తి ఉంటుంది. ఆయన ఏమి మాట్లాడతారో..?ఎటువంటి స్ట్రాటజీలు చెబుతారో..? పొత్తుల గురించి ఏమి మాట్లాడతారు..? ఏ పార్టీని ఎలా విమర్శిస్తారు..? టీడీపీని టార్గెట్ చేస్తారా..? చంద్రబాబు, లోకేష్ లను ఏమైనా అంటారా..? లేదా వైసీపీనే టార్గెట్ చేస్తారా..? లేదా బీజేపీ పొత్తు అంశాలపై ఏమైనా మాట్లాడతారా..? ఇలా అనేక అనుమానాలు వస్తూ ఉంటాయి. అందుకే ఆయన ప్రసంగంపై ఆ పార్టీ క్యాడర్ తో పాటు ఇతర రాజకీయ పక్షాలు ఆసక్తిగా గమనిస్తుంటారు. మొన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాటలు ఒక రకంగా బీజేపీలో టెన్షన్ పెట్టే విధంగా, వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉందని చెప్పవచ్చు. క్యాడర్ లో కూడా చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు.
Janasena: పరోక్షంగా సంకేతం ఇచ్చి
పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అంటున్నారు. అంటే టీడీపీ – జనసేన పొత్తుకు పరోక్షంగా సంకేతం ఇచ్చినట్లు కనబడుతోంది. రాష్ట్రంలో వైసీపీకి అతి పెద్ద వ్యతిరేక శక్తి టీడీపీ. ఆ తరువాతే జనసేన పార్టీ. ఆ మాటలను బట్టి చూస్తే ఈ రెండు పార్టీల కలయిక కన్ఫర్మ్. ఇప్పుడు బీజేపీకి టెన్షన్ ఎందుకంటే..? టీడీపీ తో బీజేపీ కలవడానికి సిద్ధంగా లేదు. సోము వీర్రాజు పదేపదే చెబుతున్నారు కూడా. తాము టీడీపీతో పొత్తు పెట్టుకోము, జనసేనతోనే కలిసి ఎన్నికలకు వెళతాము అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ యే తమ సీఎం అభ్యర్ధి అని పేర్కొంటున్నారు. మరో పక్క జాతీయ స్థాయిలో కూడా బీజేపీ అంతర్గతంగా వైసీపీతో స్నేహంగా ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీ, వైసీపీ ఒక రకంగా పొత్తులో ఉన్నట్లే లెక్క. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు ఆసక్తిగా ఉన్నారు. బీజేపీకి అది ఇష్టం లేదు. అందుకే బీజేపీలో ఒక రకమైన టెన్షన్ మొదలైంది.
Janasena: వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అంటూనే
వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అంటూనే పవన్ కళ్యాణ్ ఒకరి పల్లకీ తాము మొయ్యము అని కూడా అన్నారు. అంటే టీడీపీని మోయాల్సిన అవసరం లేదు అని పరోక్షంగా పేర్కొన్నారు. జనసేన ప్రయోజనాలు దెబ్బలేకుండా పొత్తు ఉంటుంది అన్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారు. మరో పక్క జనసేనలో కన్ఫ్యూజన్ ఉంది. బీజేపీ నుండి బయటకు వచ్చి టీడీపీతో జత కడతారా..? లేక బీజేపీతో కలిసే టీడీపీతో పొత్తుకు వెళతారా..? పవర్ షేరింగ్ అడుగుతారా …? అడగరా..? అనే అంశాలపై ఒక కన్ఫ్యూజన్. ఒకళ్ల పల్లకీ మోయమని పవన్ కళ్యాణ్ అంటే జనసేన పల్లకినీ టీడీపీ మోస్తుందా..? రాష్ట్రంలో ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే గత ఎన్నికల్లో టీడీపీకి 39 శాతం వచ్చింది. జనసేనకు 6 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేనకు విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఓ 15 శాతం పెరిగినా..మిగిలిన జిల్లాల్లో పెరగలేదనేది వాస్తవం. జనసేనకు మొత్తం మీద 10 నుండి 12 శాతం పెరిగి ఉందని అనుకున్నా..టీడీపీకి 35 శాతం కంటే ఓటింగ్ శాతం తగ్గదు.
క్యాడర్ లో కన్ఫ్యూజన్
35 శాతం ఓటింగ్ ఉన్న వాళ్లు జనసేన పల్లకీ మోయడానికి ఒప్పుకుంటారా..? అందుకే జనసేన – టీడీపీ పొత్తు విషయంలో ఇంకా క్లారిటీ లేదు. వాళ్లు ఇంత వరకు కూర్చులేదు. మాట్లాడుకోలేదు. సీట్ల సర్దుబాటు, పవర్ షేరింగ్ లపై ఇంకా చర్చలు జరగలేదు. పవన్ కళ్యాణ్ మాత్రమే మైక్ ముందు ఉన్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అంటూ పదేపదే చెబుతూ టీడీపీని పరోక్షంగా ఆహ్వానిస్తున్నారు. కానీ పల్లకీ మోయము, పల్లకీ మోయము అని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో అటు బీజేపీ, ఇటు జనసేన క్యాడర్ కన్ఫ్యూజన్ లో ఉంది. దీనిపై ఒక క్లారిటీ రావాలంటే ఎలక్షన్ సీజన్ వరకూ వేచి చూడాల్సిందే..!