Vangaveeti Radha Krishna: దివంగత వంగవీటి మోహనరంగా (Vangaveeti Ranga) తనయుడు వంగవీటి రాధా కృష్ణ (Vangaveeti Radha Krishna) తో జనసేన (Janasena) నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. విజయవాడ ఎన్బీవీకే భవన్ లో ఈ ఆదివారం జనసేన పార్టీ తరపున జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లు పర్యవేక్షణకు శుక్రవారం నాదెండ్ల మనోహర్ అక్కడకు వెళ్లారు. అనంతరం అదే ప్రాంతంలో గల వంగవీటి రాధా కార్యాలయానికి వెళ్లారు. రాధాతో అరగంట పాటు ఏకాంతంగా మాట్లాడారు నాదెండ్ల మనోహర్. దీంతో వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరడానికి రంగం సిద్ధం అయ్యిందనీ, అందుకే నాదెెండ్ల మనోహర్ ముందుగా ఆయనతో చర్చలు జరుపుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ నెల 4వ తేదీ వంగవీటి మోహన రంగా జయంతి నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షమంలో రాధా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది అంటూ ప్రచారం మొదలు పెట్టారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వంగవీటి రాధా కృష్ణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ పెద్ద గా యాక్టివ్ గా లేరు. దీంతో తరచు రాధా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. తన హత్యకు రెక్కి నిర్వహించారంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు రాధ. ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో తన స్నేహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఉండటంతో అప్పుడు కూడా మళ్లీ రాధా వైసీపీలోకి చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వారి నివాసానికి వెళ్లి రాధా, ఆయన తల్లి రత్నకుమారితో మాట్లాడటంతో అప్పటి ప్రచారానికి తెరపడింది.
వాస్తవానికి దివంగత నేత వంగవీటి రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. ఏ పార్టీలో ఉన్న రంగా అభిమానులు అహ్వానించినా కార్యక్రమాలకు రాధా హజరవుతూ వస్తున్నారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇలా పార్టీలు మారుతూ పార్టీకి కమిటెడ్ గా లేకపోవడంతో తరచు రాధా పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ తో భేటీలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని సమాచారం. అటు నాదెండ్ల మనోహర్, ఇటు వంగవీటి రాధా కూడా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను కొట్టిపారేశారు. మర్యాద పూర్వక భేటీయే కానీ రాజకీయ అంశాలపై చర్చించలేదని ఇద్దరు నేతలు మీడియాకు తెలిపారు.