Badvel By Poll: ఏపిలోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిన్నటి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే టీడీపీ తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ ను ప్రకటించగా వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధను ప్రకటించారు. ఈ ఎన్నికల బరిలో నిలవాలని జనసేన కూడా యోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బద్వేల్ ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపే విషయంపై ఉమ్మడిగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ లు ఇప్పటికే ప్రకటించారు. జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నీరుగట్టు దొర విజయజ్యోతిని బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జనసేన పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు నిన్న విజయజ్యోతికి ఫోన్ చేసి జనసేన తరపున పోటీ చేయాలని కోరినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై స్పందించిన విజయజ్యోతి తన మద్దతుదారులతో చర్చించి త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారట. రెండు రోజుల్లో విజయజ్యోతి తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.
Badvel By Poll: ఎవరు ఈ విజయజ్యోతి
విజయజ్యోతి గతంలో బ్యాంకు ఉద్యోగిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. నాడు విజయజ్యోతికి 68,800 (44.18 శాతం) ఓట్లు పోల్ కాగా నాటి వైసీపీ అభ్యర్థి తిరివేది జయరాముడు 78,879 ఓట్లు (50.66 శాతం) సాధించి 9,502 మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆమెకు టీడీపీ టికెట్ నిరాకరించడంతో విజయజ్యోతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా కేవలం 2,883 ఓట్లు వచ్చాయి.
బద్వేల్ ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న ప్రధాన పార్టీలు
కాగా బద్వేల్ ఉప ఎన్నికలను అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ తమ అభ్యర్థి దాసరి సుధను గెలిపించడానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో మొత్తం 13 మంది ముఖ్యనేతలు ప్రచార బాధ్యతలను చూస్తున్నారు. టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్ గెలుపునకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య నేతలతో కమిటీలను వేశారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ప్రారంభించారు. నిన్నటి నుండే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా తొలి రోజు నవతరం పార్టీ అభ్యర్థిగా రమేష్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. బద్వేల్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో బీజేపీ, జనసేన ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు. గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన, బీజేపీ ఇక్కడి నుండి పోటీ చేయలేదు. దీంతో ఉప ఎన్నికల బరిలో జనసేన – బీజేపి పోటీ చేస్తుందా లేదా అన్న సందిగ్దత కొనసాగుతూ ఉంది. జనసేన పోటీ చేస్తుందా లేదా అనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.