Janasena: ఏపిలో శిధిలావస్థకు చేరిన రోడ్లను బాగు చేయాలని జనసేన డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు వారాల్లో రోడ్ల మరమ్మత్తులు చేయకపోతే నిరసనగా అక్టోబర్ 2వ తేదీన జనసైనికులు శ్రమదానంతో రోడ్ల మరమత్తులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ముందుగానే జనసేన ప్రకటించింది. జనసేన అధినేత అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్ల ఫోటోలు, వీడియోలను జనసేన కార్యకర్తలు సేకరించారు. అక్టోబర్ 2న నిర్వహేంచే శ్రమదానం కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పవన్ కల్యాణ్ చర్చించారు. అయితే ఈ శ్రమదానం కార్యక్రమం కూడా వివాదాస్పదం అవుతోంది.
Read More: Cine Politics: చక్రం తిప్పిన చిరు..!? సినీ రాజకీయంతో పవన్ ఏకాకి..!
కాటన్ బ్యారేజీ పై జనసేన శ్రమదానానికి అనుమతి నిరాకరణ
పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు అక్టోబర్ 2వ తేదీన చేపట్టే శ్రమదాన కార్యక్రమానికి అవాంతరాలు ఏర్పడుతున్నాయి. కాటన్ బ్యారేజీపై శ్రమదాన కార్యక్రమానికి అనుమతి లేదని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ స్పష్టం చేశారు. కాటన్ బ్యారేజీ ఆర్ అండ్ శాఖ పరిధిలోకి రాదని ఎస్ఈ స్పష్టం చేశారు. కేవలం ప్రజల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు. కాటన్ బ్యారేజీ పై సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంటలను పూడ్చితే బ్యారేజీకి నష్టమని ఇరిగేషన్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
Janasena: శ్రమదానం చేయడానికి అనుమతి కావాలా
రోడ్ల మరమ్మత్తులకు శ్రమ దానం చేయడానికి కూడా అనుమతి కావాలా అని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు. ఎవరు అడ్డుకున్నా ముందుకే వెళ్తామనీ శ్రమ దానం చేసి తీరుతామని పేర్కొంటున్నారు జనసేన నేతలు. బ్యారేజ్ పై గుంటలు పూడ్చడం నేరమా అని ప్రశ్నిస్తున్నారు. అధ్వాన్నపు రోడ్లను బాగు చేయకూడదా? జనసేనను అడ్డుకోవడం వెనుక లక్ష్యం ఏమిటి ? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల తీరును జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు.
హడావుడిగా మరమ్మత్తు పనులు
ఓ పక్క అక్టోబర్ 2వ తేదీన రోడ్ల దుస్థితిపై నిరసనగా జనసేన ఆధ్వర్యంలో శ్రమదానం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు స్పందించారు. పలు ప్రాంతాల్లో రోడ్లకు హడావుడిగా గుంతలు పూడ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తమ పార్టీ నిరసన పిలుపు నేపథ్యంలో పవన్ వెళ్లే ప్రాంతాల్లో ఇప్పుడు హడావుడిగా రోడ్లు వేస్తున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజా సమస్యలపై స్పందించమంటే వ్యక్తిగత దూషణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.