Janasena – TDP: రాజకీయం అంటే ఒక స్ట్రాటజీ..వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు.. ఎత్తులు..పై ఎత్తులు ఉంటాయి. రాజకీయ పార్టీలు అధికారాన్ని కైవశం చేసుకోవడం కోసం వ్యూహాలు, ఎత్తుగడలు వేస్తుంటాయి. రాజకీయ వ్యూహకర్తలకు ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ పెరిగింది. ప్రశాంతి కిషోర్ (పీకే) లాంటి రాజ్యాంగేతర శక్తులు కూడా రాజ్యాంగంలో లేని రాజకీయ నిబంధనలు తీసుకువచ్చి పార్టీలకు (పెయిడ్) ప్యాకేజీల కోసం పని చేస్తూ వారికి అధికారాన్ని కట్టబెట్టడం కోసం ఏవేవో చేస్తుంటారు. ఎక్కడో బీహార్ లో పుట్టి, అక్కడి రాజకీయాలను చదివి దేశ వ్యాప్తంగా అవే అమలు చేయడానికి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లు తయారు అయ్యారు. అయితే ప్రశాంత్ కిషోర్ చేస్తున్నది తప్పా రైటా అనేది పక్కన బెడితే ప్రతి రాజకీయ పార్టీకి స్ట్రాటజీలు, స్ట్రాటజిస్ట్ లు అవసరమే. అధికారంలోకి రావాలన్నా, అధికారంలో ఉన్న వారిని దించాలన్నా స్ట్రాటజిస్ట్ లు ఉండాల్సిందే.
Janasena – TDP: పార్టీల గెలుపునకు ఈ రెండు సామాజిక వర్గాలే కీలకం
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహనరెడ్డి గారిని కుర్చీ దించాలి. వైసీపీ ఓడి పోవాలన్న పట్టుదలతో తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళుతోంది. ఆ ప్రణాళిక, స్ట్రాటజీ అమలు చేయడానికి పవన్ కల్యాణ్, చంద్రబాబు అంటే జనసేన, టీడీపీ కలిసి కొన్ని స్ట్రాటజీలు సిద్ధం చేశాయి. ఉత్తర భారతదేశంలో మతాలు రాజకీయాలను శాసిస్తుండగా తెలంగాణలో ప్రాంతం, సెంటిమెంట్, భాష, యాస ప్రభావితం చేస్తుండగా ఏపిలో మాత్రం సామాజిక వర్గాలు అంటే కులాలు శాసిస్తుంటాయి. ఏపిలో కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లు ఒక్కో ప్రాంతంలో ప్రభావాన్ని చూపిస్తుంటారు. 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గంలో 70 శాతంపైగా జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీకి మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపు, బీసీ సామాజిక వర్గాలే కీలకం. 52 శాతం బీసీ ఓట్లు ఉండగా, 16 శాతం కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. కమ్మ, రెడ్డి నేతలు ముఖ్యమంత్రులు కావాలన్నా బీసీ, కాపుల ఓట్లే కీలకం. 2019లో వైసీపీకి బలంగా ఉన్న ఈ సామాజిక వర్గంలో కొంత మేర ఇప్పుడు అసంతృప్తి, అసమ్మత్తి వచ్చాయని టీడీపీ భావిస్తోంది. జగన్మోహనరెడ్డి ఏదో చేస్తారని వారు భావించారు కానీ ఆయన చేసింది ఏమి లేదని టీడీపీ చెబుతోంది. ఎంత సేపు రాజకీయ గొడవలు, కక్షలతో పాటు ఇసుక, మద్యం తదితర వాటిల్లో అవినీతి చేస్తూ కాలం వెళ్లదీస్తుందే కానీ ఈ వర్గాలకు చేసింది ఏమిలేదని పేర్కొంటున్నారు.
Janasena – TDP: గత ఎన్నికల్లో వైసీపీకి 70 శాతం కాపుల మద్దతు
ఇప్పుడు టీడీపీ, జనసేన స్ట్రాటజీ ఏమిటంటే కాపు ఓటు బ్యాంకు లో 75 శాతం ఈ కూటమికి మద్దతు ఇచ్చేలా ముందుగా చర్చలు జరుపుతున్నారు. కాపుల్లో 50 నుండి 60 శాతం 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చారు. 2019లో 70 శాతంకు పైగా వైసీపీకి మద్దతు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో 70 నుండి 75 శాతం ఈ కూటమికి మద్దతు ఇస్తే అధికారంలోకి రావడం ఈజీ. కానీ కాపులు ఎందుకు మద్దతు ఇవ్వాలి. కాపులు చంద్రబాబును నమ్మరు గాక నమ్మరు. పవన్ కల్యాణ్ కు నిలకడ లేదు. ఈ సామాజిక వర్గానికి పవన్ కల్యాణ్ చేసింది ఏమీ లేదు. పైగా చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనను నమ్మి కాపులు చాలా మంది మోసపోయారు. కాంగ్రెస్ వ్యతిరేకం అంటూ కాంగ్రెస్ లో కలిసిపోయాడు. సో.. ఇవన్నీ చూసుకుంటూ కాపులు తమ సామాజిక వర్గం నుండి వచ్చిన పవన్ కల్యాణ్ ను నమ్మే పరిస్థితి లేదు. ఆయనకు నిలకడ లేదు, రాజకీయ పరిపక్వత లేదు అని భావిస్తున్నారు. అందుకే కాపులు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసినా పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకలో ఓడిపోయారు. మరో పక్క చంద్రబాబు తరహా రాజకీయాలకు కాపులు విసిగిపోయారు. అందుకే ఈ కూటమిని ఎందుకు నమ్మాలి అని కాపులు అనుకోవచ్చు. ఈ రెండు పార్టీలు వీళ్ల ఓట్లమీదనే ఎందుకు డిపెండ్ కావాలి అనుకోవచ్చు. జగన్మోహనరెడ్డి పాలనను కంపేర్ చేసుకుంటే గత టీడీపీ పాలనే బెటర్ అన్న నిర్ణయానికి వాళ్లు వచ్చారని టీడీపీ భావిస్తోంది. జగన్మోహనరెడ్డి కాపులకు చేసింది ఏమి లేదు. కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. కాపు కార్పోరేషన్ పెట్టినా దాని కోసం ప్రత్యేకంగా ఇచ్చిన రుణాలు కూడా ఏమి లేవు, పైగా వారికి ఇచ్చిన పదవులు అన్నీ ఉత్తుత్తి పదవులే. అంటే రబ్బర్ స్టాంప్ పదవులు, వాళ్లు ఎవరూ గట్టిగా మాట్లాడటానికి ఏమీ లేదు. నిర్ణయాధికారాలు ఏమీ ఉండవు. వీటికి స్విచ్ లు అన్నీ సీఎంఓలో, తాడేపల్లిలోనో ఉంటాయి. వీళ్లంతా పేరుకు మాత్రమే పదవుల్లో ఉండే పరిస్థితి అని చెబుతున్నారు.
Janasena – TDP: ఆ వర్గాల అసంతృప్తిని క్యాష్ చేసుకునే ప్రయత్నం
కాపు సామాజిక వర్గం ఎవరికో ఒకరికి మద్దతు ఇవ్వాలి కాబట్టి కంపేర్ చేసుకుంటే వైసీపీ కంటే జనసేన – టీడీపీ కూటమే బెటర్ అన్న భావనకు వచ్చాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దూరమైన కాపు సామాజికవర్గాన్ని దగ్గరకు చేసుకునేలా ఈ కూటమి పావులు కదుపుతోంది. దానిలో భాగంగానే జనసేన పెద్దలు, టీడీపీ పెద్దలు కాపు సామాజికవర్గ పెద్దలతో అంతర్గత చర్చలు, మీటింగ్ లు జరుపుతున్నారు. ఆ తరువాత వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్న బీసీ సామాజికవర్గాన్ని దగ్గరకు చేర్చుకునేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. బీసీలకు కార్పోరేషన్లు 56 ఏర్పాటు చేసి చైర్మన్ పదవులు, వేలాది మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చినా వారిలో పదవి వచ్చిందనే సంతృప్తి లేదని టీడీపీ, జనసేన నేతలు అంటున్నారు. ఆయా కార్పోరేషన్లలో వారికి నిర్ణయాధికారం లేదు, పాలనాధికారం లేదు. ఆ కార్పోరేషన్ కు నిధులు ఎంత వస్తున్నాయో తెలియదు, వీళ్లు ఏమి చేయాలో తెలియదు, కారుకు ఒక స్టిక్కర్ వేసుకుని తిరగడం తప్ప దేనికీ పనికిరాదని వాళ్లకు అర్ధం అయ్యిందని అంటున్నారు. ఈ రెండు సామాజిక వర్గాలలో ఉన్న వ్యతిరేకతను టీడీపీ క్యాష్ చేసుకోవాలనీ, ఇది టీడీపీ – జనసేన కలిస్తే సాధ్యపడుతుందని గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి ఆ స్ట్రాటజీ ప్రకారం అడుగులు వేస్తున్నారు. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.