Janasena : తిరుపతి ఎన్నికల బరి నుండి తాము తప్పుకుంటున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పేసిన తరువాత ఎట్టకేలకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. గత కొంత కాలంగా తిరుపతి ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే బీజెపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిలపాలని పవన్ కళ్యాణ్ భావించారు. తిరుపతిలో జనసేన అభ్యర్థిని నిలిపేందుకు గానూ కొద్ది రోజులు తిరుపతిలో మకాం వేసి ఆ నియోజకవర్గ పరిధిలో జనసేన కమిటీలను వేశారు.
ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసి వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో జనసేన తప్పుకుని బీజేపీకి మద్దతు ఇచ్చినందున తిరుపతిలో జనసేన అభ్యర్థికి అవకాశం ఇవ్వాలంటూ మొన్నటి వరకూ పట్టుబట్టారు. అయితే ఆ తరువాత ఏమి జరిగిందో ఏమో కానీ ఇరుపార్టీల నేతలు సమావేశమై చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థి తిరుపతి బరిలో పోటీ చేయడం లేదనీ, బీజేపీకి అవకాశం ఇస్తున్నట్లు చెప్పేశారు. కేంద్ర స్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత ఇస్తున్నా బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకత్వం జనసేనకు గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదనీ ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. బీజేపీ వల్ల జనసేన నష్టపోతుందంటూ వ్యాఖ్యానాలు కూడా చేశారు.
ఇప్పుడు కొత్త వివాదం వచ్చిపడింది. తిరుపతి బీజేపీ అభ్యర్థిగా ప్రకాశం జిల్లాకు చెందిన కర్నాటక క్యాడర్ రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభను ప్రకటించింది. అభ్యర్థిగా రత్నప్రభను ఎంపిక చేయడంపై జనసేన శ్రేణులు.. వైసీపీ, బీజేపీ రహస్య ఒప్పందానికి ఇది సంకేతమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రత్నప్రభ గతంలో వైఎస్ఆర్ హయాంలో పని చేశారనీ, వైఎస్ఆర్, వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపిస్తూ గతంలో ట్వీట్లు కూడా చేశారని అంటున్నారు. తిరుపతిలో జనసేన – బీజేపీ విజయావకాశాలు దెబ్బతీయడానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో వైసీపీ అనుకూల లాబీయింగ్ నడిచిందని వార్తలు షికారు చేస్తున్నాయి.
ఇప్పటికైనా పవన్ కల్యాణ్ మేల్కొని బీజేపీతో దోస్తీని ఎంత త్వరగా కటీఫ్ చేసుకుంటే జనసేనకు అంత మంచిది అన్న అభిప్రాయాన్ని కొందరు జనసైనికుల అభిప్రాయంగా ఉందట. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభను ఆ పార్టీ అధిష్టానం నిన్న ప్రకటించినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గానీ ఆ పార్టీ ముఖ్యనేతలు గానీ ఇంత వరకూ స్పందిస్తూ ఎటువంటి కామెంట్ చేయలేదు. దీనితో తిరుపతిలో బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు ఇస్తుందా లేదా అన్న విషయంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.