ప్రకాశం జిల్లాలోని 16 గ్రామాలకు చెందిన ప్రజలు తమ సంఘటిత శక్తిని నిరూపించారు. దాదాపు 20 లక్షల రూపాయలకు పైగా వెచ్చించి కాలువపై వంతెన (జనవారధి) నిర్మించి ఆదర్శంగా నిలుస్తున్నారు. త్రిపురాంతకం మండలం ముడివేముల, కురిచేడు మండలం ముష్ట గంగవరం మధ్య గుండ్లకమ్మ వాగు ప్రవహిస్తొంది. ఈ వాగుపై వంతెన నిర్మించాలని వాగుకు అటు ఇటు ఉన్న గ్రామాల ప్రజలు అనేక మార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపారు, తమ సమస్యను ప్రజా ప్రతినిధులకు విన్నవించారు. ప్రతి ఏటా అయిదారు నెలల పాటు కొండలపై నుండి వచ్చే వరద ప్రవాహం కారణంగా ఈ వాగు దాటాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. త్రిపురాంతకం నుండి జిల్లా కేంద్రం ఒంగోలు వైపు వెళ్లాలన్నా, ఇతర అవసరాలకు సమీపంలోని పది, పదిహేను గ్రామాల ప్రజలు ఈ వాగు దాటాల్సి ఉంటుంది.
వంతెన నిర్మిస్తామని ఎన్నికల సమయాల్లో నేతలు హామీలు అయితే ఇస్తున్నారు కానీ కార్యరూపం దాల్చలేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వం వంతెన నిర్మిస్తుందని ఎదురుచూసిన ఆయా గ్రామాల ప్రజలు ఇక ప్రభుత్వంపై ఆధారపడకూడదని నిర్ణయానికి వచ్చారు. స్వచ్చందంగా వంతెన నిర్మించుకోవాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడవుగా గ్రామాల నుండి విరాళాలు సేకరించారు. ఈ కాజ్ వే నిర్మాణానికి దాదాపు 20లక్షల రూపాయల వరకూ విరాళాలు అందాయి. ఇంజనీరింగ్ ప్లాన్, ఇంజనీర్ లు లేకుండానే గ్రామస్తులే తూములు ఏర్పాటు చేసి కాజ్ వే నిర్మించారు. ట్రాక్టర్ లు, ఇతర వాహనాలు ఉన్న రైతులు వాటిని అద్దె లేకుండా మట్టితోలడానికి, చదును చేయడానికి ఇవ్వగా, ప్రజలు శ్రమదానం కూడా చేశారు. కాజ్ వేకి అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేశారు.
స్థానికంగా చిన్న చిన్న పనులు చేసుకునే గుజ్జు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సాంకేతిక సహకారంతో వంతెన నిర్మాణం పూర్తి చేశారు. గత నెల 24న ఈ వంతెనను అట్టహాసంగా ఈ వంతెనను ప్రారంభించుకున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీ నేతలను ఆహ్వానించలేదు. శిలాఫలకంపై ఏ రాజకీయ పార్టీ నాయకుల పేర్లు గానీ, ప్రజా ప్రతినిధులు పేర్లు గానీ వేయలేదు. 16 గ్రామాల పేర్లు, ఆయా గ్రామాల విరాళాలనే ముద్రించారు. ప్రభుత్వ సహకారం లేకుండా ప్రజలే స్వచ్చందంగా నిర్మించుకున్న వంతెనను జనవారధిగా పిలుస్తున్నారు. దీనిపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు మాట్లాడుతూ చాలా కాలం క్రితమే వంతెన నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామనీ, మంజూరు దశలో ఉండగా, ప్రజలే వంతెనను నిర్మించుకున్నారని తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?