Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరించే ప్రతిపాదన చేస్తుండటంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కార్మిక సంఘాల నేతలు గత కొద్ది రోజులుగా ఆంధోళన, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కార్మికులు యాజమాన్యంకు సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. కార్మిక సంఘాల ఆందోళనలకు బీజెపీ మినహా వివిధ రాజకీయ పక్షాలతో యువజన, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రెండు పర్యాయాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖలు కూడా రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలని వైఎస్ జగన్ కోరారు. ఈ అంశంపై నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపిీలు రాజ్యసభ నుండి వాకౌట్ కూడా చేశారు. కార్మిక సంఘాల ప్రతినిధులు కేంద్రంలోని పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి సైతం వెళ్లారు.
ఇది ఇలా ఉంటే అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జెసీ దివాకరరెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై బాంబు లాంటి వార్త పేల్చారు. సహజంగానే దివాకరరెడ్డికి ముక్కుసూటిగా మాట్లాడటం ఆలవాటు. ఆయన పాతకాలం మనిషి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు అంటూ ఉంటారు. పలు సందర్భాల్లో చంద్రబాబుతోనూ నిర్మోహమాటంగా మాట్లాడేవారు. ఇప్పుడు తాజాగా జేసి..విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని ఆయన కుండబద్దలు కొట్టేశారు. దానికి ఆయన చెప్పిన కారణం కూడా సహేతుకంగానే ఉంది. ప్రధాన మంత్రి మోడీ ఒక్క సారి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆపడం ఎవరి తరం కాదని జేసీ స్పష్టం చేశారు.
గతంలో టీడీపీ హయాంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు, నిరసనలు జరుగుతుంటే జేసీ అప్పుడూ చెప్పేశారు. ప్రత్యేక హోదా వచ్చేదీ కాదు. అది జరిగేదీ కాదని స్పష్టం చేశారు. టీడీపీ నేతగా ఉండి కూడా జెసి తన మనసులోని మాటను బయట పెట్టారు. జేసీ చెప్పినట్లుగా మోడీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని వెనక్కు తీసుకున్న సందర్భాలు ఇప్పటి వరకూ లేవనే చెప్పవచ్చు. ప్రజల ఆందోళనలను అసలు పట్టించుకునే రకం కాదని స్పష్టం అవుతోంది. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దులో నెలల తరబడి ఆందోళనలు చేస్తుంటే చట్టాలను వెనక్కుతీసుకునే ప్రశక్తే లేదని కేంద్రం చెప్పేసింది. కొన్ని సవరణలకు మాత్రమే అంగీకరిస్తామని కేంద్రం చెప్పుకుంటూ వస్తోంది. ఇప్పుడు విశాఖ ఉక్కు అంశంపైనా మోడీ అదే తీరులో ఉంటారు అన్నది పరిశీలకుల మాటగా ఉంది. అయితే విశాఖ ఉద్యమం ఇంకా తీవ్రతరం అయితే కేంద్రం వెనక్కుతగ్గుతుందో లేదో వేచి చూడాలి.