JC Prabhakar Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకరరెడ్డి గతంలో వైఎస్ జగన్ పై ఎంతలా నోరు పారేసుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైఎస్ జగన్మోహనరెడ్డి సీఎం అయిన తరువాత జేసి కుటుంబంపై పలు కేసులు నమోదు అయ్యాయి. నకిలీ పత్రాలతో వాహన రిజిస్ట్రేషన్ లో అరెస్టు చేయడం, ఆ తరువాత జైలు నుండి బెయిల్ పై ఊరేగింపుగా వస్తున్న సందర్భంలో పోలీస్ అధికారిపై దురుసుగా ప్రవర్తించిన కారణంగా మరో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. ఆ తరువాత కూడా పలు సందర్భంగా జగన్ పై ప్రభాకరరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు అదే జేసి ప్రభాకరరెడ్డి జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ గా జేసి ప్రభాకరరెడ్డి ఎన్నికైన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు హెల్ప్ చేశారంటూ కితాబు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితిలో జగన్ తలుచుకొని ఉంటే తాను మున్సిపల్ చైర్మన్ అయ్య పరిస్థితి లేదని కూడా జెసి వ్యాఖ్యానించారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మాదిరిగానే జగన్ లోనూ విలువలు ఉన్నాయని ఈ రోజు ఆ విషయాన్ని తాను స్పష్టంగా గమనించానని పేర్కొన్నారు. తాడిపత్రి అభివృద్ధి కోసం త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి బొత్సా సత్యనారాయణను కలుస్తానన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ ను కలవడంలో తప్పేమిలేదన్న జేసీ.. స్థానిక ఎంపి తలారి రంగయ్య, స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సహకారం కోసం లేఖలు రాస్తానని చెప్పారు. తాడిపత్రి అభివృద్ధి విషయంలో ఎవరినైనా కలుస్తానన్నారు. ఒక నాడు తీవ్ర స్థాయిలో జగన్ ను విమర్శించిన జేసీ నేడు ప్రశంసలు కురిపించడంపై వైసీపీ అభిమానులు తటీజ్ జగన్, తిట్టిన నోటితోనే పొగిడించుకున్నారు అంటున్నారు.
కాగా జేసి వ్యాఖ్యాల పట్ల ఎంపి తలారి రంగయ్య, ఎమ్మెల్యే పెద్దారెడ్డిలు అదే స్పూర్తితో స్పందించారు. ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు. అభివృద్ధి విషయంలో ఆయన (జెసీ) వచ్చి అడిగితే సహకరించడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తరువాత అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పని చేసుకోవాలన్నారు.