AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్..ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నూతన సీజే మిశ్రాకు పుష్పగుశ్చం అందించారు. ఛత్తీస్గడ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర పదోన్నతిపై ఏపి హైకోర్టుకు సీజే గా వచ్చారు. 2009 లో డిసెంబర్ నెలలో ఛత్తీస్గడ్ న్యాయమూర్తిగా నియమితులైన ప్రశాంత్ కుమార్ మిశ్ర అక్కడి హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. నవ్యాంధ్ర ప్రదేశ్ కు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర మూడవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమణ స్వీకారం చేశారు.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రస్థానం
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర 1964 ఆగస్టు 29న ఛత్తీస్గడ్ లోని రాయగఢ్ లో జన్మించారు. బిలాస్పూర్ లోని గురుఘసిదాస్ వర్సిటీ నుండి బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1987 సెప్టెంబర్ నాలుగున న్యాయవాది వృత్తి చేపట్టారు. రాయగఢ్ జిల్లా కోర్టుతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2005 జనవరి నెలలో ఛత్తీస్గడ్ హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాది హోదా పొందారు. బార్ కౌన్సిల్ చైర్మన్ గా పని చేశారు. హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యుడుగా పని చేశారు. 2004 జూన్ 26 నుండి 2007 ఆగస్టు 31 వరకూ ఛత్తీస్గడ్ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ గా సేవలు అందించారు. ఆ తరువాత అడ్వొకేట్ జనరల్ గా పదోన్నత పొందారు. 2009 డిసెంబర్ పదిన ఛత్తీస్గడ్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్ర నియమితులైయ్యారు.
AP High Court: రాజధాని అమరావతి కేసు ఇక పట్టాలెక్కేనా..?
ఒక పక్క కరోనా, మరో పక్క ప్రధాన న్యాయమూర్తుల బదిలీలతో రాజధాని అమరావతి కేసు హైకోర్టులో పెండింగ్ లో పడిపోయింది. తొలుత సీజే జస్టిస్ జెకే మల్లీశ్వరి హయాంలో రాజధాని అమరావతికి సంబంధించి రోజు వారి విచారణ జరిగింది. విచారణ చివరి దశలో ఉండగా ఆయన బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ఈ ఏడాది మార్చి 6వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతి రాజధానుల కేసు అత్యంత కీలకమైనది కావడంతో గత విచారణను మొత్తం పక్కన పెట్టేసి మళ్లీ విచారణ కొనసాగిస్తామని జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి పేర్కొన్నారు. ఈ నెల చివరి వారం నుండి రోజు వారి విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ తరుణంలోనే జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బాధ్యతలు చేపట్టారు. కీలకమైన అమరావాతి రాజధాని కేసులను ఈ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా పాత విచారణను పరిగణలోకి తీసుకుంటారా? లేక మళ్లీ వాదనలు మొదటి నుండి వింటారా? అనేది ఆసక్తికరంగా మారింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనమే త్వరితగతిన విచారణ పూర్తి చేసి మూడు రాజధానుల అంశంపై తుది తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.