Kadapa district Blasting: కడప జిల్లా కులసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ పరిధిలోని సున్నపురాయి క్వారీ బ్లాస్టింగ్ ఘటనలో పది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం అయిదు శాఖల అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాధమిక విచారణలోనే క్వారీ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని తేల్చారు. ఈ క్రమంలో లీజు దారుడి జీపీఏ హోల్డర్ తో సహా అయిదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విషయంలోకి వెళితే..తిలా పాపం తలా పిరికెడు అన్నట్లు ఈ దుర్ఘటన వెనుక నిబంధనలు పాటించని క్వారీ నిర్వహకుడితో పాటు ప్రభుత్వ ఆదేశాలను పాటించని కొందరు అధికారుల బాధ్యత కనబడుతోంది. ఈ సున్నపురాయి క్వారీ కడపకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య సతీమణి చెన్నంశెట్టి కస్తూరిబాయి పేరుతో లీజ్ కు తీసుకున్నార. 2001 నవంబర్ 2వ తేదీ నుండి 2021 నవంబర్ 1వ తేదీ వరకూ 20 ఏళ్లు ముగ్గురాళ్ల మైనింగ్ కోసం గనుల శాఖ లీజ్ కు ఇవ్వగా లీజు దారురాలు ఈ మైనింగ్ ను మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగరిమఠం అధికార వైసీపీ నాయకుడు నాగేశ్వరరెడ్డి కి జీపిఎ ఇచ్చారు. ప్రస్తుత ఆయన ఆధ్వర్యంలో భూగర్భ మైనింగ్ జరుగుతోంది.
అయితే 2019 నవంబర్ నెలలో మైనింగ్ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించిన సందర్భంలో పలు వయిలేషన్స్ ను గుర్తించారు. షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ తరువాత 2020 ఆగస్టు 25న మరో సారి తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ లీజ్ రద్దుకు చేయాలంటూ ఉన్నతాధికారులకు మైనింగ్ ఏడి రవిప్రసాద్ సిఫార్సు చేశారు. అంతే కాకుండా ఆ ప్రాంతంలో మైనింగ్ జరగకుండా చూడాలంటూ స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. అయితే స్థానిక అధికారుల పర్యవేక్షణ లోపం, అధికారి సిఫార్సులపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో తాత్సారంతో క్వారీ నిర్వహకుడు నిబంధనలు పాటించకుండా క్వారీయింగ్ కొనసాగించడం, ఈ క్రమంలోనే ప్రమాదం జరిగి పది మంది దుర్మరణం పాలవ్వడం సంభవించింది.
ఇక్కడ మరో విషయం గమనించాలి..విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల వరకూ చెల్లించిన ప్రభుత్వం ఇక్కడి ప్రమాద బాధితులకు కేవలం పది లక్షలు ఇవ్వడం ఏమిటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి ప్రమాద బాధితులకు పరిహరం పెంచాలని కోరుతున్నారు.