CBI: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు ఏపి సర్కార్ షాక్ ఇచ్చింది. కడపలో వారికి కేటాయించిన గెస్ట్ హౌస్ గదులను ఖాళీ చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏడాదిన్నర నుండి సీబీఐ అధికారులు ఆర్ అండ్ బీ అతిధి గృహంలో మూడు గదులను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. రాత్రి వేళల్లో సీబీఐ అధికారులు అక్కడే బస చేస్తూ.. ఉదయం దర్యాప్తులో భాగంగా కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్, పులివెందుల గెస్ట్ హౌస్ కు వెళ్లి వస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఆర్ అండ్ బీ అతిధి గృహంలో సీబీఐ అధికారులు తీసుకున్న గదులను ఖాళీ చేయాలంటూ జిల్లా అధికారుల నుండి ఆదేశాలు రావడం చర్చనీయాంశమయ్యింది.
CBI: ఈ నెల 15న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప పర్యటన సందర్బంగా
ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనకు వెళుతున్నారు. ఒంటి మిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో పాల్గొననున్నారు. సీఎం వస్తుండటంతో ఆయన బస చేయడానికి వీలుగా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మరమ్మత్తులు చేయాలని నిర్ణయించారు. అందు కోసమే సీబీఐ అధికారులను ఖాళీ చేయాలని ఆదేశించారు. స్వామి బ్రహ్మోత్సవాల తర్వాత తిరిగి గదులు కేటాయిస్తామని సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. జిల్లా అధికారుల ఆదేశాల నేపథ్యంలో సీబీఐ అధికారులు రెండు రోజుల్లో వసతి గృహాన్ని ఖాళీ చేసే అవకాశం ఉంది.