YS Suneeta: తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని, రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత జిల్లా ఎస్పీతో సహా డీజీపీ, సీబీఐ అధికారులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై కడప జిల్లా ఎస్పీ కేకే ఎన్ అన్బురాజన్ వెంటనే స్పందించారు. పులివెందులలో డాక్టర్ సునీత నివాసం వద్ద శాశ్వత పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా సునీత లేఖలో పేర్కొన్న ఇతర అంశాలపై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ స్థాయి అధికారిని ఆదేశించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసి కీలక సమాచారాన్ని రాబట్టిన సీబీఐ అధికారులు మరి కొందరు కీలక వ్యక్తులను పిలిచి విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీత ఇంటి వద్ద అనుమానితులు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించిన ఆమె పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై ఎస్పీ తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకున్నారు.