NTR Univerity: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడానికి తీసుకున్న నిర్ణయం అనేక విమర్శలకు దారితీస్తుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుగా మార్చడానికి వైసీపీ నిన్న అసెంబ్లీ సమావేశాలలో బిల్లు తీసుకొచ్చి ఆమోదం పొందించుకుంది. దీంతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు వివిధ పార్టీల నేతలు నందమూరి కుటుంబ సభ్యులు మండిపడుతూ ఉన్నారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ సైతం రియాక్ట్ అయ్యి.. వర్సిటీ పేరు మార్చటం తప్పు పట్టడం జరిగింది.
తాజాగా ఇప్పుడు ఇదే రీతిలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు. 1986లో విజయవాడలో మెడికల్ యూనివర్శిటీ స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య, విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు ఈ మహావిద్యాలయనికి అంకురార్పణ చేశారు. ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది మరియు లెక్కలేనన్ని నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులను దేశానికి అందించింది.
తెలుగు రాష్ట్రాలలో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు మార్చబడింది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం నాకు బాధ కలిగించింది. కేవలం రాజకీయ లాభం కోసం చాలా మందికి భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవటం తప్పు.. అంటూ మండిపడ్డారు. దీంతో కళ్యాణ్ రామ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.