మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం (టీడీపీ)లో చేరారు. గుంటూరులోని తన నివాసం నుండి పెద్ద సంఖ్యలో అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి చేరుకుని చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. చంద్రబాబు పసుపు కండువా కప్పి కన్నా లక్ష్మీనారాయణను పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు టీడీపీ కండువా కప్పుకున్నారు. గుంటూరు మాజీ మేయర్, కన్నా కుమారుడు నాగరాజు, తాళ్ల వెంకటేశ్ యాదవ్, మాజీ ఎంపీ లాల్ జాన్ బాషా సోదరుడు, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ఎమ్ నిజాముద్దీన్ తదితరులు టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో కన్నా చేరడం శుభపరిణామమని చంద్రబాబు కొనియాడారు. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి అని కితాబు ఇచ్చారు. ఏపీ రాజకీయాల్లో ఆయన విభిన్న పదవుల్లో చూశానని గుర్తు చేశారు. ఏపి రాజకీయాల్లో కన్నాకు ప్రత్యేక స్థానం ఉందనీ, హుందాతనం, పద్ధతి, నిబద్దత కల్గిన వ్యక్తి ఆయనంటూ ప్రశంసలు కురిపించారు. సిద్దాంతం కల్గిన రాజకీయాల్లో కన్నా ఒకరు అని చంద్రబాబు అన్నారు. వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారనీ, 2004 నుండి 2014 వరకూ మంత్రిగా సేవలు అందించారన్నారు. టీడీపీతోనే ఏపి అభివృద్ధి అని భావించి కన్నా టీడీపీలోకి వచ్చారని తెలిపారు. అమరావతే రాజధానిగా ఉండాలని కన్నా భావిస్తున్నారని పేర్కొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ సేవలను పార్టీ సమర్ధవంతంగా ఉపయోగించుకుంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. ఆయన అనుభవం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని చంద్రబాబు అన్నారు.
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ తాను చంద్రబాబు నేతృత్వంలో టీడీపీలో ఎందుకు చేరుతున్నాను అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిననీ, ఇవేళ టీడీపీలో చేరడంపై సందేహాలు కలగవచ్చని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, తండ్రిని మరిపించేలా పరిపాలిస్తానంటూ ఒక్క చాన్స్ అడిగి అధికారంలోకి వచ్చారన్నారు. కానీ సంక్షేమం అంటూనే చాక్లెట్ ఇచ్చి నెక్లేస్ ఎత్తుకెళుతున్న విధంగా పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేలా ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నారని అన్నారు. కానీ ఏపిలో జగన్ రాక్షస పాలన పోవాలి, అమరావతే రాజధాని కావాలన్న రెండు కారణాలతో తాను ఇవేళ టీడీపీలోకి వస్తున్నానని కన్నా తెలిపారు.