గుంటూరు కోర్టులో మంగళవారం ఓ ఆసక్తికరపరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు ప్రముఖ నేతల మధ్య రాజీ కుదరడంతో 12 ఏళ్ల నాటి కేసు పరిష్కారం అయ్యింది. పరువునష్టం దావా కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణలు నేడు కోర్టుకు హజరైయ్యారు. 2010 లో రాయపాటి సాంబశివరావుపై అప్పటి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పరువునష్టం దావా దాఖలు చేశారు. ఆనాడు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా వారి మధ్య విభేదాలు ఉండేవి. ఆ క్రమంలో కన్నా లక్ష్మీనారాయణపై రాయపాటి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో లక్ష్మీనారాయణ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
ఈ కేసు 12 ఏళ్లుగా కోర్టులో నడుస్తూనే ఉంది. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు టీడీపీలో చేరగా, కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఇద్దరు నేతలు వేరు వేరు పార్టీలో ఉన్నప్పటికీ పరువునష్టం దావా విషయంలో రాజీకి వచ్చారు. కన్నాపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నాానని రాయపాటి తెలియజేయగా, పరువు నష్టం దావాను వెనక్కి తీసుకునేందుకు కన్నా సంసిగ్ధత వ్యక్తం చేశారు. ఇరువురు తమ న్యాయవాదుల ద్వారా కోర్టుకు ఈ విషయాన్ని తెలియజేశారు. పరువు నష్టం దావాను కన్నా ఉపసంహరించుకున్నారు. దీంతో 12 ఏళ్ల నాటి కేసు పరిష్కారం అయ్యింది. ఒకే పార్టీ లో ఉన్న సమయంలో శతృవులుగా ఉన్న వీరు ప్రస్తుతం వేరువేరు పార్టీలో ఉన్న సమయంలో రాజీపడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాలం మాన్పుతుంది గాయం అంటే ఇదేనేమో..!