కర్నూలు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. దివంగత నాయకుడు కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు కుమార్తె, మాజీ జడ్పీటీసీ కె బొజ్జమ్మ (సుశీలమ్మ) దంపతులు వైసీపీలో చేరారు. సీఎం జగన్మోహనరెడ్డి సమక్షంలో సోమవారం బొజ్జమ్మ ఆమె భర్త దేవనకొండ మాజీ ఎంపీపీ రామచంద్ర నాయుడులు వైసీపీ కండువా కప్పుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వీరికి సీఎం జగన్మోహనరెడ్డి పార్టీ కండువా కప్పు సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ పి రామ సుబ్బారెడ్డి, కడప జడ్ పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి పాల్గొన్నారు. నారా లోకేష్ పాదయాత్ర కర్నూలులో ముగిసిన కొద్ది రోజుల వ్యవధిలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు టీడీపీలో ఉన్న బొజమ్మ కుటుంబం వైసీపీ తీర్దం పుచ్చుకోవడం విశేషం. అయితే వీరు ప్రత్యర్ధులు టీడీపీలో చేరిన నేపథ్యంలో పార్టీ పట్ల సైలెంట్ గా ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆలురులో టీడీపీ కనుమరుగు అయ్యిందన్నారు. 40 సంవత్సరాలుగా టీడీపీలో ఉండి ఎన్నో నష్టాలు, కష్టాలు ఎదుర్కొన్న బొజ్జమ్మ, రామచంద్ర నాయుడు పార్టీలో చేరారని అన్నారు. కపట్టాళ్ల వెంకటప్పనాయుడు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని, 2024 లో కూడా జగన్ ను మళ్లీ సీఎం గా చేసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా వైసీపీలో చేరిన బొజ్జమ్మ మాట్లాడుతూ తన తండ్రి మరణానంతరం టీడీపీకి పని చేశాననీ, తన తండ్రిని చంపిన వారిని చంద్రబాబు పార్టీ లో చేర్చుకున్నారని విమర్శించారు. గుర్తించని పార్టీలో ఉండటం అనవసరం అనిపించిందన్నారు. టీడీపీ కోసమే తమ కుటుంబం బలైందని, అయినా తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల పార్టీ అంటూనే చంద్రబాబు బీసీలకు ఏం న్యాయం చేయలేదని విమర్శించారు. సీఎం జగన్ బీసీలకు చేస్తున్న మేలుతో తాము వైసీపీలో చేరినట్లు తెలిపారు. సీఎం జగన్ తమకు రక్షణ కల్పిస్తారన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.