ఏపిలో కాపు రిజర్వేషన్ అంశంపై మరో సారి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ అంశంపై ఇటీవల బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్శింహరావు అడిగిన ప్రశ్నపై కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ సమాధానమిస్తూ .. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య సంస్థల్లో ఆర్టికల్ 342 ఏ (3) ప్రకారం కాపులకు రిజర్వేష్లు కల్పించవచ్చని, ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రాలకు కేంద్రం నుండి అనుమతి అవసరం లేదని తెలిపారు. ఈ విషయాన్ని ముద్రగడ తన లేఖలో ప్రస్తావిస్తూ ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను కాపులకు ఇచ్చే అంశంపై పరిశీలన చేయాలని కోరారు.
తాము ఎవరి కోటాలనూ వాటా పెట్టమని అడగడం లేదనీ, అందరూ అనుభవించగా మిగిలిన దానిలోనే కల్పించాలని కోరుతున్నట్లు ముద్రగడ పేర్కొన్నారు. రిజర్వేషన్లు కల్పించి పేద కాపులకు మంచి చేయాలని విన్నవించారు. దివంగత ఎన్టీఆర్, వైఎస్ఆర్ లను ప్రజలు దేవుళ్లుగా భావిస్తున్నారనీ, వారి మాదిరిగా పేద వర్గాలకు మంచి చేసి తమరు కూడా ప్రజలతో ప్రేమించబడటానికి పునాదులు వేసుకోవాలని కోరారు. తాను పుట్టిన ఊరు, రాజకీయ బిక్ష పెట్టిన ప్రజలు, ఆఖరికి పుట్టిన కులం కోసం అవకాశం ఉన్నంత వరకూ ఇతరులకు నష్టం కలగకుండా సహాయపడాలన్నదే తన తపన తప్ప తమరిని ఇబ్బందిపెట్టాలన్న ఉద్దేశం కాదని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి స్పష్టీకరణ, ముద్రగడ లేఖ నేపథ్యంలో సీఎం జగన్ ఈ అంశంపై ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. గతంలో సీఎం జగన్మోహనరెడ్డి సాధ్యం కాని విషయమైన రిజర్వేషన్లపై కాపులకు మోసపు హామీ ఇచ్చి మభ్యపెట్టలేనని పేర్కొన్నారు.