Mudragada: ‘కాపులకు రిజర్వేషన్లు కల్పించాలి.. కాపులకు రాజ్యాధికారం దక్కాలి…’ ఈ మాటలు ఎక్కువగా వినిపించే నేత ముద్రగడ పద్మనాభం. రాజకీయంగా కాపు సామాజికవర్గ ముద్రగడ ఠక్కున గుర్తొస్తారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో ఆయన 2016లో రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. నిజానికి కాపు రిజర్వేషన్ల అంశంపై 1994లోనే ఉమ్మడి ఏపీలో పెద్ద ఉద్యమం చేశారు. కాపుల్లో ముఖ్య నేతగా ఉన్నా.. అప్పటి నుంచీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన యాక్టివ్ కాలేదు. కానీ.. రెండున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆయనే కాపులకు ముఖ్యనేతగా ఉన్నారంటే ఆయన చరిష్మా అర్ధం చేసుకోవచ్చు. అటువంటి ముద్రగడను ఇప్పుడు కాపు నేతలు పక్కన పెడుతున్నారా..? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి.
కాపులకు రాజ్యాధికారం..
‘కాపులకు రాజ్యాధికారం దక్కాలి..’ అని ఇటివల ముద్రగడ ఓ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీలను కలుపుకుపోవాలని పిలుపునిచ్చారు. కాపుల ఐక్యత గురించి అనేక సందర్భాల్లో కొందరు కాపు నేతలు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేదు. కానీ.. ముద్రగడ సీన్ లోకి వస్తే ఆ ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. కాపులందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. 2016లో తునిలో కాపు ఉద్యమంతో హోరెత్తించారు. ఫలితంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఏపీలో ఎన్నికల సమయంలో కాపులకు రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడం.. ఆ తర్వాత ఆ ఉసే లేకుండా పోవడం సర్వసాధారణం. అటువంటి అంశాన్ని గట్టిగా పట్టుబట్టారు ముద్రగడ.
ముద్రగడను కలుపుకుంటారా..
ఇప్పుడు కాపులకు రాజ్యాధికారం కావాలని.. అందరూ సంఘటితం కావాలని అంటున్నారు. అయితే.. కాపులంతా ఆయనతో వస్తారా..? ఆయనను కలుపుకోకుండా మిగిలిన కాపు నేతలే ఐక్యంగా వెళ్తారా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కన్నా, గంటా, జేడీ.. వంటి కాపు నేతలు సామాజికవర్గ భేటీలు నిర్వహించినా ఎక్కడా ముద్రగడ లేరు. ఆమధ్య పవన్ కల్యాణ్ కాపు నేతలతో జరిపిన సమావేశంలోనూ ముద్రగడ లేరు. కాపుల సమస్యలపై ఎక్కువగా స్పందించింది ముద్రగడ పద్మనాభమే. మరి.. ఇటువంటి సమావేశాల్లో ఆయన ఉండకపోవడం.. ఆయన నిర్ణయమా..? నేతల నుంచే ఆయనకు పిలుపు లేదా..? ఆయన్ను దూరం పెడుతున్నారా..? వారికే తెలియాలి..!