తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మాణానికై అవసరమైన ఒక ఎకరా భూమి కేటాయించాలని కర్ణాటక కాగినెలె కనకదాసు గురుపీఠ పీఠాధిపతి జగద్గుదు శ్రీశ్రీశ్రీ నిరంజనానందపురి మహాస్వామి కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం జగన్మోహనరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. కర్ణాటక పురపాలక శాఖ మంత్రి ఎం.టి.బి.నాగరాజు, మాజీ మంత్రి హెచ్.ఎం.రేవణ్ణ, కర్ణాటక వెనుకబడిన కులాల ఫెడరేషన్ ప్రెసిడెంట్ బికే రవిలతో కలిసి స్వామిజీ మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుని సీఎం జగన్ తో భేటీ అయ్యారు.

తిరుమల క్ష్రేత్రంలో తమ కురబ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు మఠం లేదనీ, లక్షలాది మంది స్వామి వారి భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని పీఠాధిపతి సీఎంకి వివరించారు. అంతే కాకుండా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కీర్తనలు, ప్రసస్ధ్యానికి తమ పీఠానికి ఉన్న చరిత్రను మహాస్వామి ముఖ్యమంత్రికి వివరించారు. పీఠాధిపతి విజ్ఞప్తిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ సందర్భంలో సీఎం జగన్ ను సత్కరించి బొకె అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్, వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
