Katti Mahesh: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంపై అనేక మంది సినీ ప్రముఖులు, వివిధ వర్గాలకు చెందిన వారు సంతాపం తెలియజేశారు. అయితే గతంలో కత్తి మహేష్ శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో హిందువుల్లో కొందరు ఆయన మరణంపై భిన్నంగా స్పందించారు. శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన అభియోగంపై గతంలో హైదరాబాద్ లో పోలీసులు ఆయనను అరెస్టు కూడా చేశారు.
కాగా కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి ముందు చివరగా శ్రీరాముడిపై భక్తిగీతం ఆలపిస్తూ చేసిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భక్తి పారవశ్యంతో ఇది పాడినట్లుగా ఉందని పేర్కొంటున్నారు. “శ్రీరాఘవం దశరథాత్మజ మప్రేమయం| సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్|| ఆజానుబాహుమరమింద దళాయతాక్షం| రామం నిశాచర వినాశకరం నమామి||” అంటూ కత్తి మహేష్ భక్తిగీతాన్ని ఆలపించారు. ఈ సెల్పీ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్ లు కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీరాముడిపై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన కత్తి మహేష్ భక్తి పారవశ్యంతో శ్రీరాముడిని స్తుతిస్తూ భక్తిగీతం ఆలపించడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియో అసలైనదేనా, మార్ఫింగ్ వీడియోనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కత్తి మహేష్ గత నెల 26న చిత్తూరు నుండి హైదరాబాద్ కు కారులో వెళుతుండగా నెల్లూరు జిల్లాలో తాను ప్రయాణిస్తున్న కారు లారీకి ఢీకొట్టింది. నాడు తీవ్రంగా గాయపడిన కత్తి మహేష్ అక్కడ ప్రధమ చికిత్స అనంతరం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కత్తి మహేష్ వైద్య ఖర్చుల కోసం ఏపి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నుండి రూ.17లక్షల ఆర్థిక సహాయం కూడా మంజూరు చేసింది. మెరుగైన వైద్య సేవలు అందించినప్పటికీ చికిత్స పొందుతూ గత శనివారం నాడు మృతి చెందారు.