YS Jagan: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొరుగు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డంగా బుక్ చేస్తున్నారా? తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలతో ఏపీ సర్కారు ఇరుకున పడుతోందా? వైఎస్ జగన్ రాజకీయ ప్రత్యర్థులకు ఈ సందర్భం కలిసివస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో వాహనాల నిలిపివేతపై ప్రతిపక్షాలు వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తున్నాయి.
సరిహద్దుల్లో కలవరం
కరోనా కల్లోలం నేపథ్యంలో సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఏపీ నుంచి వచ్చే రాకపోకలపై ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఏపీ నుంచి కృష్ణా జిల్లా గరికపాడు ద్వారా వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు నిలుపుదల చేశారు. సరిహద్దులో కోదాడ మీదుగా మాత్రమే వాహనాలను తెలంగాణలోకి అనుమతిస్తామని పేర్కొన్న పోలీసులు మఠంపల్లి, పులిచింతల వద్ద ఉన్న చెక్పోస్టులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంబులెన్స్లు, అత్యవసర సేవల వాహనాలను అనుమతిస్తున్న పోలీసులు ఈ-పాస్ లేని వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో సరిహద్దులో గందరగోళ పరిస్థితి నెలకొంది.
తెలుగుదేశం ఫైర్
రాష్ట్ర సరిహద్దులో వాహనాల నిలిపివేత ఘటనను ఉపయోగించుకొని ఏపీ సర్కారుపై టీడీపీ విరుచుకుపడుతోంది. తెలంగాణ- ఏపీ సరిహద్దులో ప్రతిసారీ పంచాయితీలు జరగం ఏంటని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రం మంత్రినో, ఎమ్మెల్యేనో ఆపితే సీఎం జగన్ ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? ముఖ్యమంత్రికి ప్రజల బాగోగులు పట్టవా? సరిహద్దులో ఇంత జరుగుతున్నా స్పందన ఎందుకు లేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో ప్రత్యేక చట్టాలు ఏమైనా అమలు జరుగుతున్నాయా? ఆ రాష్ట్రం దేశంలో అంతర్భాగం కాదా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు.