KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తక్షణమే దృష్టి పెట్టాల్సింది కరోనా సమయంలో నెలకొంటున్న ఇబ్బందుల గురించి, మారుతున్న పరిస్థితుల గురించి అంటూ రెండు రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఓ వైపు కరోనా టెన్షన్ పరేషాన్ చేస్తుంటే ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ప్రాణాంతక బ్లాక్ ఫంగస్ బారినపడిన రోగులు కంటి చూపును కోల్పోతున్నారు. ఏపీలో ముగ్గురు, తెలంగాణలో నలుగురు బ్లాక్ ఫంగస్ బారిన పడి మృతి చెందడం కలకలం రేకెత్తిస్తోంది.
బ్లాక్ ఫంగస్ భయం…
కోవిడ్ చికిత్స తర్వాత కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. కర్నూలుకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్తో మృతి చెందారు. గుంటూరుకు చెందిన 30 ఏళ్ల యువకుడు, కర్నూలు ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స తీసుకొని కోలుకున్న60 ఏళ్ల వృద్ధుడు తర్వాత బ్లాక్ఫంగస్ లక్షణాలతో మళ్లీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బ్లాక్ ఫంగస్ రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణలోనూ డేంజర్ బెల్స్….
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది. వేములవాడలోని జాతర గ్రౌండ్ కు చెందిన 25 సంవత్సరాల యువకుడు మృతి బ్లాక్ ఫంగస్ తో మృతి చెందినట్లు సమాచారం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన గురజాల అంజల్ రెడ్డి (42) కూడా బ్లాక్ ఫంగస్ తో మృతి చెందారు. గతనెల 23వ తేదీన నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాతో చేరిన అంజల్ రెడ్డి..12 రోజుల పాటు చికిత్స పొందిన తరువాత తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇదిలాఉండగా, బ్లాక్ ఫంగస్ నియంత్రణకు మందుల కొరత నెలకొంటున్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మందుల కొరతతో రోగులు, వారి కుటుంబీకులు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సీఎంల పకడ్బందీ చర్యలే ఈ సమస్య నుంచి రోగులను బయటపడేస్తాయని పలువురు పేర్కొంటున్నారు.