KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనూహ్య సమస్య ఒకటి వచ్చిపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా దక్కిందేమీ లేదనే సంగతి తెలిసిందే. దీనిపై సహజంగానే బీజేపీ ని విపక్ష పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి.
ఇలాంటి సమయంలో తమను తాము , అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీని రక్షించుకునేందుకు తెలుగు బీజేపీ నేతలు తెగ కష్టపడిపోతున్నారని అంటున్నారు. ఢిల్లీ నేతల నుంచి మొదలుకొని గల్లీ నేతల వరకూ అంతా ఇదే పనిలో ఉన్నారని చెప్తున్నారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఇరుకున పెడుతున్నారు.
KCR జీవీఎల్ గారి స్పందన చూశారా?
బీజేపీ పై ఈగ వాలనీయకుండా జాగ్రత్తపడే రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర బడ్జెట్పై ప్రశంసలు కురిపించారు. కేంద్ర బడ్జెట్పై స్పందించిన జీవీఎల్.. దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచేలా, భారత దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే బడ్జెట్ ఇది అన్నారు. ప్రజల బడ్జెట్, పన్నుల భారం మోపకుండా ఈ బడ్జెట్ ఉందని పేర్కొన్న ఆయన.. ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చే బడ్జెట్గా అభివర్ణించారు. కొన్ని వస్తువులపై “సెస్” విధించడం ద్వారా మార్కెట్ యార్డులలో మౌలిక సదుపాయాలు పెంచనున్నారని వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం, మౌలిక వసతులను మెరుగు పరిచే బడ్జెట్ ఇదన్న బీజేపీ ఎంపీ.. కేంద్రం ప్రభుత్వం ఆరోగ్యరంగంపై పెట్టే ఖర్చు గణనీయంగా పెంచిందన్నారు.. ఆరోగ్యరంగంలో “ఆత్మనిర్భర్” సాధించేందుకు నిధులు కేటాయించారు. మార్కెట్ యార్డులలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు లక్ష కోట్ల రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విమర్శలు చేయడం సహజమన్న ఆయన.. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారని విశ్లేషించారు.
బండి సంజయ్ ఏమంటున్నారంటే…
దేశ ప్రజల అంచనాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజా సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి ఆకాంక్షించే విధంగా దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలా బడ్జెట్ ఉందని ఎంపీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విశ్లేషించారు. అదనంగా మరో కోటి మందికి మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచిత సిలిండర్ల సాయంతో పాటు మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ ద్వారా పొగచూరిన మహిళల జీవితాలలో వెలుగులు నింపిన బడ్జెట్ ఇదన్న ఆయన… కరోనాతో నెమ్మదించిన దేశ ఆర్ధిక వ్యవస్థకు మళ్లీ ఉరుకులు పెట్టించే బడ్జెట్, కరోనా తర్వాత ప్రజల్లో భారత ప్రగతిపై విశ్వాసం పెంచేలా ఈ బడ్జెట్ ను రూపొందించారు. కరోనా నేర్పిన పాఠంతో… ఆరోగ్యరంగానికి పెద్దపీట వేసిన బడ్జెట్ అని పేర్కొన్నారు.
కేసీఆర్ పై నిప్పులు
కేంద్ర బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యత దక్కిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విశ్లేషించారు. కేంద్ర బడ్జెట్ లో సబ్ క సాత్, సబ్ క వికాస్, సబ్ క విశ్వాస్ కనిపిస్తోందన్నారు. బడ్జెట్ లో కేటాయింపులు అన్ని రాష్ట్రాలకు ఉంటాయని తెలిపారు. మొన్ననే తెలంగాణలోని జాతీయ రహదారులకు నిధులు ఇచ్చారని వెల్లడించిన ఆమె.. కేంద్రం దగ్గర ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్.. రాష్ట్ర ఎంపీలతో సమావేశం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. దేశ భవిష్యత్, యువత, రైతు, అందరి భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోడీ ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నారని…ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన సంస్కరణలకు సీఎం కేసీఆర్ మద్దతు ఇవ్వాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.