KCR: తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ఊహించని షాక్. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హోదాలో చేసిన ఏకైక విదేశీ పర్యటన చైనా దేశంలోనే. కారణాలు ఏవైనా ఇప్పుడు అదే దేశం నుంచి ఆయనకు ఊహించని షాక్ ఎదురైంది.
తెలంగాణ విద్యుత్ శాఖపైనా పంజా విసిరేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నించారు.. ఈ విషయంపై తెలంగాణ విద్యుత్ శాఖను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరించింది. ముంబై గ్రిడ్నే కాదు… ఏకంగా తెలంగాణ గడ్డను కూడా టార్గెట్ చేసిన ఉదంతం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.
KCR అసలేం జరిగింది?
వివిధ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం, చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్, తెలంగాణ ట్రాన్స్ కో సర్వర్లను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలంగాణ విద్యుత్ శాఖను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ గుర్తించింది. దీంతో ముందస్తుగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని బ్లాకింగ్ సర్వర్స్, కంట్రోల్ పంక్షన్స్ ని గమనిస్తూ ఉండాలని సూచించింది. దీంతో తెలంగాణ విద్యుత్ శాఖ అప్రమత్తమైంది.. విద్యుత్ శాఖ వెబ్ సైట్ లో కొనసాగుతున్న అందరి యూసర్ ఐడీ, పాస్వర్డ్లను మార్చేసింది.
అధికారులు ఏం చేస్తున్నారు?
ఊహించని రీతిలో జరుగుతున్న అటాక్ ప్రయత్నాలపై టీఎస్ జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. చైనా హ్యాకర్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. గ్రిడ్కు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందీ లేదన్న ఆయన.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.