KCR Govt: తెలంగాణ సరిహద్దులో అంబులెన్స్ల తనిఖీ కొనసాగుతోంది. అనుమతి పత్రాలు లేని అంబులెన్స్ లను తెలంగాణ పోలీసులు వెనక్కు పంపుతున్నారు. ఓ పక్క విజయవాడ – హైదరాబాద్ రహదారిపై రామాపురం అడ్డరోడ్డు వద్ద, కర్నూరు – హైదరాబాదు రహదారిపై పుల్లూరు టోల్ గేట్ వద్ద తెలంగాణ పోలీసులు ఏపి అంబులెన్స్ లను నిలుపుదల చేసి తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఆసుపత్రుల నుండి బెడ్ అనుమతి పత్రం, తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ పాస్ అనుమతి పత్రాలు ఉన్న అంబులెన్స్ లను మాత్రమే పంపుతున్నారు. ఎటువంటి పత్రాలు లేని పేషంట్స్ అంబులెన్స్ లను వెనక్కు పంపుతున్నారు.
రెండు రోజుల క్రితం రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్స్ లను నిలుపుదల చేసి వెనక్కు పంపడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇతర రాష్ట్రాల అంబులెన్స్లు రాష్ట్రంలో ప్రవేశించడంపై గురువారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. అసుపత్రుల బెడ్ అనుమతి పత్రం, తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ పాస్ తీసుకున్న అంబులెన్స్ లను మాత్రమే అనుమతించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్నారు. రామాపురం అడ్డరోడ్డు వద్ద, పుల్లూరు చెక్ పోస్టు వద్ద పెద్ద సంఖ్యలో అంబులెన్స్ లను నిలుపుదల చేయడంతో పేషంట్స్, వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పుల్లూరు చెక్ పోస్టు వద్ద అంబులెన్స్ లు ఆపేస్తున్న విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెక్ పోస్టు వద్దకు వెళ్లి తెలంగాణ పోలీసులతో మాట్లాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పోలీసులు తమ ప్రభుత్వ అదేశాలను ఎమ్మెల్యేకు వివరించడంతో ఆయన అంబులెన్స్ లలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. విజయవాడ సింగ్ నగర్ కు చెందిన వినోద అనే వృద్ధురాలికి పక్షవాతం వచ్చింది. ఆమెను సంబంధించి హైదరాబాదు లోని ఆసుపత్రి చూపినా తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ పాస్ లేదన్న కారణంతో అనుమతించలేదు. పరిస్థితి విషమంగా ఉంటే ఆంక్షలు ఏమిటని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.