KCR Jagan: రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసిఆర్, వైఎస్ జగన్మోహన రెడ్డి మళ్లీ కలిశారు. ఏపి, తెలంగాణ జల వివాదాల తరువాత ఈ ఇద్దరు సీఎంలు ఒకే వేదికపై కనిపించారు. సీఎంలు కేసిఆర్, వైఎస్ జగన్ పక్కపక్కనే కూర్చుని చాలా సేవా కబుర్లు చెప్పుకున్నారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనుమరాలు స్నిగ్ధారెడ్డి వివాహ వేడుక ఇందుకు వేదిక అయ్యింది. శంషాబాద్ కొత్తగూడలోని వీఎన్ఆర్ ఫామ్స్ లో ఆదివారం అంగరంగ వైభవంగా స్నిగ్ధారెడ్డి, రోహిత్ రెడ్డిల వివాహం జరిగింది. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వద్ద ప్రత్యేక అధికారిగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడే వరుడు రోహిత్ రెడ్డి. ఈ కారణంగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, వైఎస్ విజయమ్మ, ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటి సీఎం పుష్ప శ్రీవాణి తదితర ఏపికి చెందిన ప్రముఖులు ఈ వివాహా వేడుకకు హజరై వధూవరులను ఆశీర్వదించారు. మరో పక్క హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు వివాహ వేడుకకు హజరైయ్యారు.
KCR Jagan: జల వివాదం తరువాత..
గతంలో ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుసుకోవడం ఇదే ప్రధమం. జల వివాదాల మరో సారి తెరపైకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ నుండి సీఎం కేసిఆర్ హజరు కావాల్సి ఉండగా ఆయన తరుపున హోంశాఖ మంత్రి, సీఎస్ లు హజరైయ్యారు. దీంతో ఈ ఇద్దరు సీఎంలు తారసపడలేదు. తాజాగా ఈ ఇద్దరు సీఎంలు ఒకే వేదిక పంచుకోవడం విశేషం.
ఒకే వేదికపై జగన్, కేసిఆర్
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్నాయి. ప్రధానంగా నీటి సమస్యతో పాటు విభజన చట్టంలోని పలు అంశాలు పరిష్కారం కాలేదు. ఆస్తుల పంపకాలు, విద్యుత్ బకాయిల అంశాలు ఉన్నాయి. గతంలో సఖ్యతగా ఉన్న ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎక్కడ తేడా వచ్చిందో ఎవరికీ తెలియదు కానీ ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు, సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కొనసాగుతున్నాయి. మరో పక్క ఏపి, తెలంగాణ అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ఈ తరుణంలో కేసిఆర్, వైఎస్ జగన్ లు ఒకే వేదిక పంచుకుని ఆప్యాయంగా మాట్లాడుకోవడం ప్రాధాన్యతను సంతరించుకోంది.