KCR : తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఆశ్చర్యపోయే పరిణామం ఇది. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన కేసీఆర్ తన ఎత్తుగడల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటే… ఇంకా చెప్పాలంటే నాన్చివేత దోరణి అవలంభిస్తుంటే… ప్రతిపక్ష పార్టీ మాత్రం దూసుకుపోతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మునుపెన్నడూ లేని విధంగా వరుసగా పాదయాత్రలకు సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో ఉప ఎన్నికలు , ఎమ్మెల్సీ ఎన్నికలకు సై అంటున్నారు.
KCR కేసీఆర్ సర్… ఏంటిది?
తెలంగాణలోని నల్గొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థుల విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చించిన కాంగ్రెస్ అధిష్టానం తమ అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి అభ్యర్థిగా రాములు నాయక్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి అభ్యర్థిగా జి. చిన్నారెడ్డి పేర్లను ప్రకటించేసింది. అయితే, ఇప్పటికీ అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఓ చోట ప్రకటించలేదు. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి మరోసారి టీఆర్ఎస్ అవకాశం కల్పించగా… ఇంకా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది.త్వరలోనే తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నప్పటికీ ఇంకా పార్టీ అభ్యర్థి ఎవరో ఖరారు కాకపోవడం టీఆర్ఎస్ వర్గాలనే అయోమయానికి గురి చేస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్ నేతల దూకుడు…
మరోవైపు కాంగ్రెస్ ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు , అటు ఉప ఎన్నికను సవాల్ గా తీసుకుంటోంది. అదే సమయంలో నేతలు ప్రజల్లో పాదయాత్రలతో తిరుగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించగా… ఆదిలాబాద్ నుండి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రైతు ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వీరికి తోడుగా మరో ఇద్దరు సీనియర్ నేతలు మేము సైతం పాదయాత్రకు రెడీ అంటున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. నార్కట్పల్లి నుంచి ఎస్ఎల్బీసీ వరకు పాదయాత్రకు సిద్ధం అవుతుండగా… ఈ నెల
22వ తేదీ నుంచి వారం రోజుల పాటు పాదయాత్ర చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. సదాశివపేట నుండి గన్ పార్క్ వరకు జగ్గారెడ్డి పాదయాత్ర చేస్తారని చెబుతున్నారు.