KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాక్ డౌన్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తన వైఖరిని ప్రకటించనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ నేటితో ముగియనుంది. మరోవైపు మంగళవారం హోంశాఖమంత్రి మహమూద్ అలీ.. పోలీసులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం.. లాక్డౌన్పై సీఎం కేసీఆర్దే తుది నిర్ణయమంటూ ప్రకటించడంతో.. ఈ నెల 30 తర్వాత తెలంగాణలో లాక్డౌన్ తప్పదా? అనే చర్చ మొదలైంది.. అయితే, దీనిపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. అయితే, నేడు సీఎం కేసీఆర్ కీలక ప్రకటన వెలువరించనున్నట్లు సమాచారం.
మంత్రి ఈటల రాజేందర్ ఏమంటున్నారంటే…
కేంద్రం సెకండ్ వేవ్ వస్తోంది అని చెప్పింది.. కానీ, ఇంత తీవ్రంగా ఉంటుంది అని హెచ్చరించలేదని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం.. ఈ పరిస్థితిని దేశాల వారీగా చూస్తున్నారు.. రాష్టాల వారీగా చూడటం లేదన్న ఈటల.. కేంద్రం చెప్పిన సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నామన్నారు. తెలంగాణలో లాక్డౌన్ పెట్టే ఆలోచనే లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ఏం చెప్తారో?
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులతో పాటు ఎన్నికల నిర్వహాణపై నేడు హైకోర్టులో విచారణ సందర్భంగా మరోసారి తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే తీరుపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కర్ఫ్యూ నేటితో ముగుస్తుండటం మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్న నేపథ్యంలో కీలక నిర్ణయం వెలువడనుందనే ప్రచారం జరుగుతోంది.