KCR :కేసీఆర్… తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ రథసారథి. ప్రస్తుత రాజకీయాల్లో అపర చాణక్యుల్లో ఆయన స్థానం ప్రత్యేకం. అలాంటి గులాబీ దళపతి తాజాగా సొంత పార్టీ నేతలపైనే గుస్సా అయ్యారు. తన అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాల సీఎం కేసీఆర్ ఒకింత ఆగ్రహంగా మాట్లాడారు. సీఎం మార్పు అంటూ నేతలు మాట్లాడుతున్న తీరుపై సమావేశంలో సీఎం కేసీఆర్ అసహనం , ఆగ్రహం వ్యక్తం చేశారు . అయితే, ఈ కామెంట్ల విషయంలో ఆయన కీలక విషయం మర్చిపోయారని అంటున్నారు.
కేసీఆర్ ఎందుకు ఇలా?
సీఎం మార్పుపై నేతలు మాట్లాడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. తానే సీఎంగా ఉంటానని నేతలకు తేల్చి చెప్పారు. ఇకపై ఎవరైనా ఈ అంశంపై మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని కేసీఆర్ హెచ్చరించారు . తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానన్న ఆయన ఎవరూ నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని అన్నారు. నా ఆరోగ్యం సహకరించకుంటే నేనే చెప్తా అప్పుడు ఎవర్ని సీఎం చేయాలన్నది మీతోనే మాట్లాడతా అని కేసీఆర్ అన్నారు. మీకంటే ఆత్మీయులు నాకెవ్వరూ లేరని అన్నారు. పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడితే చర్యలు తప్పవని కేసీఆర్ అనారు. అసెంబ్లీ సాక్షిగా నేనే సీఎం అని చెప్పా అని కూడా అన్నారు.
రాములమ్మకు చాన్స్ దొరికింది
మరోవైపు , సీఎం కేసీఆర్పై బీజేపీ నేత విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విలీనం పేరుతో ప్రాంతీయ పార్టీలను లేకుండా చేశారని మండిపడ్డారు. `టీఆర్ఎస్ తప్ప మిగతా ప్రాంతీయ పార్టీలు దెబ్బతిన్నాయని కేసీఆర్ అన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇతర ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించకుండా కోవర్టు ఆపరేషన్లతో, కుట్రలతో అబద్ధపు దుష్ప్రచారాలతో ఎన్నో దుర్మార్గాలు చేసి, ఆ తర్వాత చర్చలని చెప్పి ఆ పార్టీలను తెలంగాణ ఐక్యత పేరుతో విలీనం చేయించి, ఆ పార్టీలు లేకుండా చేసిన ఘనత కేసీఆర్ దే“ అంటూ మండిపడ్డారు.
సీఎం కుర్చీ విషయంలో…
తన కుర్చీ కుమారుడికి మారుతుందని అన్నందుకే… ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయి నేతలను బండకేసి కొడతానని… పార్టీ నుండి ఊడపీకుతానని ఎగిరి, దుమికి కేసీఆర్ విమర్శలు చేశారని విజయశాంతి ఆరోపించారు. “సీఎం పదవి ఎడమ కాలి చెప్పుతో సమానం అని కేసీఆర్ చెప్పడం విడ్డూరం. అంత లెక్కలేని దానికి ఇన్ని తిట్లు, శాపనార్థాలు ఎందుకో? సీఎం పదవి గురించి మాట్లాడితే ఇంత ఆగం అవుతున్న కేసీఆర్ గారు, అయోధ్య గురించి, రిజర్వేషన్ ఉద్యోగుల గురించి అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కనీసం ఖండన చెయ్యకపోవడం గమనార్హం.” అంటూ విజయశాంతి నిప్పులు చెరిగారు.