KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓ వైపు పార్టీ రథసారథి, ముఖ్యమంత్రిగా తానే ఉంటానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన గులాబీ దళపతి మరోవైపు కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు. GHMC కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక కోసం అధికార పార్టీ ఇప్పటికే వడపోత మొదలుపెట్టగా.. ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్న సమయంలో సీల్డ్ కవర్ మేయర్ అంశాన్ని కేసీఆర్ తెరమీదకు తెచ్చారు.
KCR గ్రేటర్ లో ఏం జరగనుంది?
జీహెచ్ఎంసీలో పూర్తి మెజారిటీ తమదేనన్న టీఆర్ఎస్.. మేయర్ పదవి మహిళకేనని ప్రకటించింది. అయితే, ఆ పార్టీకి సొంతంగా మేయర్ పీఠం సాధించే సీట్లు రాలేదు. ఈ నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరికి వెళ్తాయి, మహిళకు మేయర్ పదవి ఇస్తారా అనేది పెద్ద సందిగ్ధం. బల్దియా నూతన పాలక మండలి ఏర్పాటుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. GHMC నూతన పాలక మండలి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు బల్దియాలో నూతనంగా ఎంపికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు GHMC మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్వేతామహంతి.. జీహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్తో కలిసి పరిశీలించారు. దీంతో తెలగాణ సీఎం కేసీఆర్ చర్చకు తెరదించుతూ తానే సీల్డ్ కవర్ లో మేయర్పేరును ఖరారు చేసి అందిస్తానని వెల్లడించారు.
వీరికే మేయర్ చాన్స్ ?
ఖైరతాబాద్ కార్పోరేటర్ విజయారెడ్డి వరుసగా రెండుసార్లు గెలవడంతో PJR ఛరిష్మాతో మేయర్ కాబోతున్నారని ఆమె అనుచరులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. 2016లో మేయర్ పదవి కోసం ప్రయత్నం చేసినా దక్కలేదు. ఈసారి మేయర్ పదవి పక్కాగా తనకే అని విజయారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. హఫీజ్ పేట్, మాదాపూర్ రెండు డివిజన్లలో వరుసగా రెండుసార్లు TRS నుంచి గెలిచిన పూజిత, జగదీశ్వర్ గౌడ్ దంపతులు.. మేయర్గా తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. 2009లో మేయర్ పదవి వచ్చినట్లే వచ్చి చేయి దాటిపోయిందనేది వీరి వాదన. ఈసారి తమకే మేయర్ పీఠం దక్కుతుందని పూజిత, జగదీశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూజితకు మేయర్గా అవకాశం కల్పించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ద్వారా జగదీశ్వర్ గౌడ్ లాబీయింగ్ చేస్తున్నారు. వీరితో పాటుగా శ్రీ వెంకటేశ్వర కాలనీ నుంచి రెండుసార్లు గెలిచిన మన్నే కవితా రెడ్డి.. ఈమధ్య కేటీఆర్ను కలిసి తనకు మేయర్గా అవకాశం ఇవ్వాలని కోరారు. మొదటి నుంచి TRSను నమ్ముకుని ఉన్న మన్నే గోవర్ధన్ రెడ్డి ఫ్యామిలీకి న్యాయం చేస్తానని KTR పలుమార్లు చెప్పారు. ఇప్పటికే కేటీఆర్, కవితను కలిసొచ్చిన మన్నె కవిత.. మేయర్ పదవి తమదేనంటూ చెప్పుకుంటున్నారు. తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీదేవి శోభన్ రెడ్డి, భారతీనగర్ కార్పోరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి కూడా మేయర్ రేస్లో ఉన్నారు. వీరితో పాటు ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి సైతం బరిలో ఉన్నారు.