KCR : తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విపక్షాలకు విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య విషయంలో కఠినంగా వ్యవహరించారు. న్యాయవాది గట్టు వామన్ రావు దంపతులను కాపుకాచి నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా విచక్షణా రహితంగా దుండగులు హత్య చేశారు. వామన్ రావు సతీమణి కారులోనే మృతి చెందగా, వామన్ రావును ఆసుపత్రికి తరలించే సమయంలో మృతి చెందారు. అయితే, ఈ ఉదంతంలో ప్రధానంగా పేరు వినిపించిన మంథని మండల టీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కుంటా శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రచ్చో రచ్చ…
దంపతుల దారుణ హత్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు నిరసనలు తెలియజేశారు. అఖిలపక్షం మంథని బంద్ నిర్వహించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును పోలీసులు డీల్ చేశారు. ఆరు బృందాలు నిందితుల కోసం గాలింపులు చేపట్టాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ హత్యకు సంబంధించి కుంట శ్రీనివాస్, కిరణ్ అక్క పాక కుమార్ లను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో సీపీ ప్రెస్ మీట్ లో వీరిని పోలీసుల ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.
ఆ కారణంతోనే దారుణ హత్య…
దేవాలయం భూములకు సంబంధించిన వ్యవహారమే హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దేవాలయం భూముల విషయం అసలు కారణం కాదని, వామన్ రావు హత్య వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని, వారినివారిని తక్షణమే అదుపులోకి తీసుకొని తగిన శిక్ష విధించాలని, మృతుడి తండ్రి అవేదన వ్యక్తం చేస్తున్నారు.