KCR: అందరి అంచనాలు నిజం చేస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ ఎపిసోడ్ పై రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు.
నివేదిక పక్కాగా ఉంది…
సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేశారు. ఈటల రాజేందర్ భూములను కబ్జా చేసినట్టు కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. జమున హేచరీస్ ఆధీనంలో భూములు ఉన్నట్టు గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు. హాకింపేట, అచ్చంపేట గ్రామాల్లో భూములు కబ్జా జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 20 మంది బాధితులకు సంబంధించిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. బెదిరించి భూములను బాధితుల నుంచి లాక్కున్నట్టు, అనుమతి లేకుండా అసైన్డ్ భూముల్లో చెట్లను తొలగించినట్లు, అనుమతి లేకుండా జమున హేచరీస్ లో పౌల్ట్రీ షెడ్డులను నిర్మించినట్లు నివేదికలో పేర్కొన్నారు.
ఈటల తొలగింపునకు బేస్ అదే
తెలంగాణ మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ తొలగింపు వెనుక కలెక్టర్ నివేదిక ను బేస్ చేసుకున్నట్లు సమాచారం. ఈ స్పష్టమైన సమాచారంతో నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా అసమ్మతి వర్గాలకు చెక్ పెట్టేలా ఈ డెసిషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది.