KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతోందని విపక్షాలు విమర్శలు చేస్తుండవచ్చు . కొన్ని అంశాల్లో ప్రజల్లో వ్యతిరేకతను స్పష్టం చేస్తుండవచ్చు. కానీ అదే విపక్షాలు కేసీఆర్కు ఒక విధంగా కలిసి వచ్చే అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా జరిగిన ఓ ఘటన ఇదే విషయాలన్ని స్పష్టం చేస్తుందని ప్రస్తావిస్తున్నారు. అదే కీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల కుస్తీ పట్లు.
KCR : ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా…
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రాములు నాయక్ను ఆ పార్టీ బరిలోకి దించింది. అయితే, ఈ ఎంపికపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం రసాభసాగా మారింది. డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన రాంచంద్రనాయక్, నెహ్రూ నాయక్ వర్గాలు ఘర్షణకు దిగాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఈ గొడవ జరగడం గమనార్హం. దాదాపు 20 నిమిషాల పాటు ఇరువర్గాల మధ్య ఘర్షణ కొనసాగింది. స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకున్నా గొడవ సద్ధుమణగలేదు. చివరకు అందరు నేతలు జోక్యం చేసుకోవడంతో గొడవ ఆగింది.
కాంగ్రెస్ ఎలా బాగుపడుతుందో…
ఎన్నికల సమయంలో.. .అందులోనూ పీసీసీ చీఫ్ సమక్షంలో ఇలాంటి ఘర్షణలు ఏంటి? అని ఆ పార్టీ నేతలే విస్తుపోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చి అధికారంలోకి రావాలన్న కసి కొందరు నేతల్లో కనిపిస్తుంటే మరికొందరు నేతల్లో తమ వ్యక్తిగత ప్రయోజనాలు విమర్శలు, వివాదాలు ప్రాధాన్యంగా మారాయని చెప్తున్నారు. ఇలాంటి విపక్షం ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్కు ఇంక టెన్షన్ ఏం టుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.