KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట అంటే పరిపాలనలో , పార్టీలో శాసనం అనే సంగతి తెలిసిందే. ఒకవేళ ఆ విషయంలో తేడాలు వస్తే… అంతే సంగతి. అయితే, అలా తేడాలు వచ్చే పరిస్థితి వరకు తెచ్చుకోరు. కానీ తాజాగా కీలకమైన విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట చెల్లుబాటు కావడం. ఈ అంశం ప్రజల ఆరోగ్యంతో కూడకున్నది కావడంతో…హాట్ టాపిక్గా మారింది.
కేసీఆర్ చెప్పినా…
కేంద్ర ప్రభుత్వం యొక్క ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరడం గురించి సుదీర్ఘ చర్చోపచర్చల తర్వాత ఇటీవలే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ అమలుకు సంబంధించి విధివిధానాలన్నీ ఖరారు అయ్యాయని ఈ నెల 18న సీఎం కేసీఆర్ ప్రకటించి ఈ పథకం ద్వారా ప్రజలు చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎంపానల్డ్ హాస్పిటల్స్లో ఆయుష్మాన్ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలంటూ అదే రోజు హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సహజంగానే, ఆయుష్మాన్ భారత్ పథకం అమల్లోకి వస్తే కరోనా ట్రీట్మెంట్ ఉచితంగా లభిస్తుందని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఇదంతా జరిగి ఆరు రోజులు గడుస్తున్న పథకం అమలు ఊసే లేకపోవడం చర్చకు కారణంగా మారింది.
ఇదీ విషయం…
తెలంగాణ రాష్ర్టంలో 26.11 లక్షల కుటుంబాలు ఆయుష్మాన్ పరిధిలో ఉన్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒక్కో కుటుంబం రూ.ఐదు లక్షల వరకూ ఈ పథకం కింద ఉచితంగా చికిత్స పొందొచ్చు. అయితే ఆయా హాస్పిటళ్లు ఆయుష్మాన్లో ఎంపానల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి గైడ్లైన్స్ రిలీజ్ అయితే, దాన్ని బట్టి ఎంపానల్మెంట్ చేసుకుంటామని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి గానీ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి గానీ సమాచారం ఇవ్వలేదు. ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్నట్టు మీడియాలో చూడడమే తప్ప, తమతో అసలు చర్చించనే లేదని, కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ చెప్తోంది.