KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ … ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికరమైన పోలిక. చెప్పాలంటే ఖచ్చితంగా పోలిక పెట్టాల్సిన సందర్భం. ఎందుకంటే కీలకమైన ఉద్యోగుల విషయంలో పెద్ద చర్చకు దారి తీసిన పీఆర్సీ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ నివేదికపై ఉద్యోగులు భగ్గుమన్న సంగతి తెలిసిందే. అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో పీఆర్సీ వాయిదా పడింది. అయితే, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీపై కసరత్తు జరుగుతుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
జగన్ సర్కారు తేల్చేస్తోంది
అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటన అంశంపై తుది కసరత్తు చేస్తోంది. ఇందులో ఉద్యోగ సంఘాల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయం తీసుకున్నారు. అనంతరం పీఆర్సీ ప్రకటనపై కసరత్తు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వానికి అందిన పీఆర్సీ నివేదికను అనుసరించి 30 శాతానికి అటు ఇటుగా ప్రకటించే అవకాశం ఉంది.
ఏపీలో ఏం జరుగుతోందంటే…
ఏపీ సర్కారు పీఆర్సీ ఇచ్చేందుకు తుది కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల్లో కొత్త చర్చ జరుగుతోంది. తెలంగాణ వలే తక్కువ మొత్తం ఇస్తారేమోనన్న భావనతో పీఆర్సీపై ఎలాంటి ప్రకటన వస్తుందోననే ఉత్కంఠ మాత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో కొనసాగుతోంది. అందుకే పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.