KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఎత్తుగడల గురించి, పరిపాలన వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలిలో పరిపాలన చేయడంలో గులాబీ దళపతి రూటే సపరేటు. అలా కరోనా కల్లోలం కొనసాగుతున్న సమయంలో ఆయన గాంధీ ఆస్పత్రిని స్వయంగా సందర్శించారు. కోవిడ్ పేషెంట్లను, వైద్యులను కలిసి మాట్లాడారు. వారికి ధైర్య నింపారు. దీనిపై అభినందనలు , విమర్శలు తెలంగాణ వ్యాప్తంగా వచ్చాయి. అయితే ఏపీ నుంచి మాత్రం కితాబు దక్కింది.
మోడీ ముందే చెప్పినా…
కరోనా నివారణలో ఏపీ ప్రభుత్వం తీరుపై ఆయా పార్టీలు తమ వైఖరిని వినిపించే సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నివారణ, నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ కన్నా రెండు గంటల దీక్ష చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిపై ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించారని అయితే ఆ సూచనలను లైట్ తీసుకున్నారని మండిపడ్డారు. వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ సర్కారు వైఫల్యం అయిందని, వ్యాక్సినేషన్ ప్రక్రియను సైతం రాజకీయం చేయడం ఏపీ సీఎం జగన్కే చెల్లిందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
ఏపీ లో కొత్త మిత్రులు..
తాడేపల్లి నివాసం నుంచి ఏపీ సీఎం జగన్ బయటకు రావాలని బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. కరోనాతో ప్రజలు పడే ఇబ్బందులను తెలుసుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగా ఏపీ సీఎం జగన్ ఆస్పత్రుల్లో పర్యటించాలని కోరారు. కాగా, ఏపీలో కేసీఆర్ ను కొత్త మిత్రులు ప్రశంసించడం బాగానే ఉంది కానీ… దీన్ని వైసీపీ శ్రేణులు ఎలా తీసుకుంటాయో మరి!