కేశినేని సోదరుల మధ్య ఏమి జరిగింది..! వాళ్లిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏమిటి,.? అసలు వివాదం ఏమిటి,.? దీనిలో చంద్రబాబు పాత్ర ఏమిటి..? కేశినేని నాని అసలు తన సోదరుడు చిన్ని మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది..? అంతర్గతంగా ఏమి జరిగింది..? అనే విషయాలను పరిశీలిస్తే… కేశినేని నాని రెండు సార్లు విజయవాడ నుండి ఎంపీగా గెలిచారు. ఆయన రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీలో ఫేమస్ అయిన నాయకుడు. ఆయన భావాలు, భావ వ్యక్తీకరణ ముక్కుసూటిగా ఉంటుంది. టీడీపీలో ఉన్నప్పటికీ చంద్రబాబుకు, పార్టీకి గుడ్డిగా భజన చేసే టైప్ కాదు. కొన్ని కొన్ని భావాలను, ఉద్దేశాలు ఆయన ట్వీట్ లు చూసినా, ఆయన ఫేస్ బుక్ పోస్టులు చూసినా అర్ధం అవుతుంది. నాని ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా మాట్లాడతారు అనే పేరు ఉంది. ఇదే క్రమంలో టీడీపీలో అంతర్గత మార్పుల పట్ల నాని అసంతృప్తిగా ఉన్నారు. ఈ రాజకీయం ఇలా ఉంటే.. వాళ్ల సోదరుల వివాదం దృష్టికి వెళితే..
ఎంపీ స్టిక్కర్ వివాదంపై కేసు నమోదు
కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని స్వయంగా కేశినేని శ్రీనివాస్(నాని) తమ్ముడు. కేశినేని చిన్ని టీఎస్ 07 హెచ్ డబ్ల్యూ 7777 కారు వాడుతున్నారు. ఈ కారుకు వీఐపీ ఎంపీ స్టిక్కర్ ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వం కార్ స్టిక్కర్ లు ఇస్తుంటుంది. నాని తమ్ముడు కావడంతో చిన్ని ఆ స్టిక్కర్ వాడుతున్నారు. నాని దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నా స్టిక్కర్ అపరిచిత వ్యక్తులు వాడుతున్నారు. దుర్వినియోగం చేస్తున్నారు వారిపై చర్యలు తీసుకోండి అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మే 27వ తేదీన నాని ఫిర్యాదు చేయగా, హైదరాబాద్ పోలీసులు ఆ కారు పట్టుకుని విచారించారు. ఈ కారు కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మి పేరుతో ఉండటంతో వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి కేసు నమోదు చేశారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు బహిర్గతం అయ్యాయి. తన సొంత తమ్ముడు తన పేరు, స్టిక్కర్ వాడుకుంటున్నారు, తన హోదాను తన దుర్వినియోగం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడం, దానిపై వారిని పోలీస్ స్టేషన్ కు పిలిచించడం, కేసు నమోదు చేయడం అన్నీ జరిగిపోయాయి. అయితే ఈ వివాదం ఇంత దూరం ఎందుకు వచ్చింది అంటే..?
విజయవాడ రాజకీయాల్లో యాక్టివ్ గా శివనాథ్
కేశినేని చిన్ని (శివనాథ్) ఇప్పటి వరకూ బ్యాక్ రౌండ్ రాజకీయాల్లోనే ఉన్నారు. నేరుగా రాజకీయాలు చేయలేదు. గత ఆరు నెలల నుండి డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. ఆరు నెలల నుండి ఆయన పొలిటికల్ టీమ్ యాక్టివ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆయన వర్గీయులు పోస్టులు పెడుతుండటం, శివనాథ్ నేరుగా టీడీపీ నేతలను కలుస్తూ క్యాడర్ కు దగ్గర అవుతున్నారు వారికి కావాల్సిన సహకారాన్ని అందిస్తున్నారు. దీంతో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గ్యాప్ వచ్చింది. కేశినేని నానికి కొంత మంది నాయకులతో పడదు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు విజయవాడ పరిధిలోని బొండా ఉమా, తదితర ముగ్గురు నలుగురు ముఖ్య నేతలతో కేశినేని నానికి చిన్న చిన్న విబేదాలు ఉన్నాయనేది టాక్. ఇదే క్రమంలో చంద్రబాబుపైనా నాని అసంతృప్తిగా ఉన్నారుట. టీడీపీలో స్ట్రాంగ్ లీడర్ అయినప్పటికీ నాని చేస్తున్న ట్వీట్లు ఆ పార్టీ శ్రేణులకు నచ్చడం లేదు. కేశినేని నాని అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న సమయంలో శివనాథ్ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. అడపదడపా టీడీపీ మీటింగ్ లో పాల్గొంటున్నారు. విజయవాడ పట్టణంలో నాని వ్యతిరేకులు చాలా మంది చిన్నితో సన్నిహితంగా మెలుగుతున్నారు. పరిటాలలో జరిగిన రైతు పోరు సభలో యాక్టివ్ గా పాల్గొన్నారు.
నాని తిరుగుబాటు చేయవచ్చన్న భయంతో..
కేశినేని నాని పార్టీలో రెబల్ గా ఉంటూ తన మాట నెగ్గించుకోవాలి అనే ఆలోచనతో ఉండి ఉండవచ్చు. నాని పార్టీకి ఏకు మేకుగా అవుతున్నారని భావించిన పార్టీ ఆయనకు ప్రత్యామ్నాయం కోసం చూస్తుండగా శివనాథ్ ప్రత్యామ్నాయంగా కనిపించారు. పార్టీ ఆయన్ను ప్రోత్సహిస్తొంది. పార్టీ మీద ప్రేమ ఉన్నా నాయకత్వంపై నచ్చక ఎప్పుడైనా నాని తిరుగుబాటు చేయవచ్చు అన్న భయంతో శివనాథ్ ను పార్టీ ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టిందనేది టాక్. నానికి ప్రత్యామ్నాయంగా చిన్ని ఉంటారని భావించి పార్టీ ప్రోత్సహిస్తొంది. చిన్ని కింది స్థాయి కార్యకర్త నుండి పై స్థాయి నాయకుల వరకూ అందరినీ కలుస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న కొన్ని పనులు నచ్చక
నాని ఒక వేళ పార్టీ నుండి బయటకు వెళ్లినా, చిన్ని ద్వారా ఆ స్థానాన్ని భర్తీ చేయవచ్చు అన్న ఆలోచనకు టీడీపీ వచ్చేసింది. చంద్రబాబు కూడా ఆ ధీమాలో ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇది నానికి నచ్చడం లేదు. తనకు ప్రత్యామ్నాయం ఉండకూడదు. నియోజకవర్గంలో పట్టు కోల్పోకూడదు అన్నభావన లో నాని ఉన్నారు. వాస్తవానికి నాని పార్టీ వదిలిపోయే వ్యక్తి కాదు. టీడీపీ అంటే ఆయనకు ప్రాణం, ఇష్టం. కానీ టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న కొన్ని పనులు ఆయనకు నచ్చడం లేదు. ఆయన వ్యక్తిత్వానికి, ముక్కుసూటి తనానికి పార్టీలో అంతర్గతంలో జరుగుతున్న వ్యవహారాలు నచ్చక కొన్ని సందర్బాల్లో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది నచ్చక పార్టీ ప్రత్యామ్నాయాన్ని రెడీ చేసింది. ఈ పరిణామాలతో ఇద్దరు అన్నదమ్ముల మధ్య రాజకీయ వైరం మొదలైంది. రాబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ తరపున శివనాథ్ పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. శివనాథ్ వ్యూహాలు అలా ఉన్నాయంటున్నారు. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.