APPSC: ఏపిపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్ పరీక్షలపై ఏపి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ -1 పరీక్షల్లో తదనంతర చర్యలన్నింటినీ నాలుగు వారాల పాటు నిలుపుదల చేయాలని ఆదేశించింది. గురువారం జరగాల్సిన ఇంటర్వ్యూలను కూడా నిలిపివేయాలని ఆదేశించింది. గ్రూప్ -1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని దాఖలైన ఎనిమిది పిటిషన్ లపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కౌంటర్ దాఖలు చేయాలని ఏపిపీఎస్సీని అదేశించింది. పిటిషన్లపై హైకోర్టులో నిన్న విచారణ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. గ్రూప్ -1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో గ్రూప్ -1 ఇంటర్వ్యూలను నాలుగు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఏపీపీఎస్సీ ..తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.