Dammalapati Case: మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. దమ్మాలపాటి కేసులో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేసిన ఏపి ప్రభుత్వం దాన్ని ఉపసహరించుకున్నట్లు నేడు తెలియజేసింది. అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ అభియోగాలపై రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు వెల్లడించిన నేపథ్యంలో గురువారం దమ్మాలపాటి కేసులో పిటిషన్ ను వెనక్కి తీసుకున్నట్లు ఏపి ప్రభుత్వం తెలిపింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ముందస్తు సమాచారంతో భూములు కొనుగోలు చేశారనే కేసులో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వ్యులపై ఏపి ప్రభత్వం గతంలో సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏజీ హోదాలో ఉండి భూములు కొనుగోలు చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసిబి నమోదు చేసిన కేసుపై స్టే ఇస్తూ హైకోర్టు గాగ్ ఆర్డర్ జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై గత సంవత్సరం నవంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
దీనిపై గురువారం సుప్రీంలో విచారణ జరగ్గా.. హైకోర్టులో పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉందన, దానిపై కౌంటర్ దాఖలు చేయనున్నట్లు తెలియజేసిన ప్రభుత్వ తరపు న్యాయవాది ఈ పిటిషన్ ను ఉపసంహరించుకున్నట్లు తెలియజేశారు. కాగా నాలుగు వారాల్లో విచారణ ముగించాలని హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది.