Kishan Reddy : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై కిషన్ రెడ్డి స్పందన గురించి పలువురు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన భైంసా అల్లర్ల విషయంలోనూ … ఏపీలో ఆందోళనలకు కేంద్రంగా మారిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy భైంసా గురించి ఏమంటున్నారంటే…
భైంసాలో పథకం ప్రకారం హిందువులపై పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు . టీఆర్ఎస్ సహాయంతో, మజ్లిస్ పార్టీ నేతృత్వంలోనే ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసుల కళ్లముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. నాలుగేళ్ల చిన్నారిని యువకుడు అత్యాచారం చేస్తే పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు. పోలీసులు నేరస్తుల మీద చర్యలు తీసుకోకుండా టీఆర్ఎస్ అడ్డుపడుతోందని కిషన్ రెడ్డి అన్నారు. భైంసాలో జరిగిన ఘటనలపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతామని కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి క్షేత్రస్థాయి పోలీసుల గురించి ఇలా వ్యాఖ్యలు చేసే బదులుగా నేరుగా చర్యలు తీసుకోవచ్చు లేదా వివరాలు తెప్పించుకోవచ్చు కదా అంటూ పలువురు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
వైజాగ్ స్టీల్ విషయంలో….
ఇక ఏపీలో హాట్ టాపిక్గా మారిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్న కిషన్ రెడ్డి … నష్టాల్లో ఉన్న ప్లాంట్ను నడపడం భారం అని తేల్చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే.. కేంద్రం ఆలోచిస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. తెలుగు గడ్డకు చెందిన ఎంపీ, కేంద్ర మంత్రిగా ఆయన గలం వినిపించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రం మాటనే చెప్పడం గమనార్హమని పలువురు అంటున్నారు.