kodali nani : కొడాలి నాని… వైసీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి. పార్టీ నేతల్లో ఆయన గలం ప్రత్యేకం. ఆర్కే రోజా … సినీ నటి, నగరి ఎమ్మెల్యే. తనదైన శైలిలో కామెంట్లకు పెట్టింది పేరు. గత కొద్దికాలంగా కొడాలి నాని కీలక పరిణామాలతో వార్తల్లో నిలుస్తుంటే తాజాగా ఆ జాబితాలో ఎమ్మెల్యే రోజా చేరనున్నట్లు చెప్తున్నారు. అదే ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను టార్గెట్ చేయడం.
kodali nani కొడాలి నాని కలకలం….
ఏపీ ఎస్ఈసీపైనా, నిమ్మగడ్డ రమేశ్ కుమార్పై మంత్రి కొడాలి నాని పలు సంచలన కామెంట్లు చేశారు. దీంతో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడొద్దంటూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై మంత్రి కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ వేశారు.
అయితే, ఎస్ఈసీని అవమానించేలా, విధులకు ఆటంకం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు వివిధ వీడియోలు, ఇతర సాక్ష్యాధారాలను పరిశీలించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎస్ఈసీ ఆదేశాల జాబితాలో త్వరలో ఎమ్మెల్యే రోజా చేరనున్నారా? అనే చర్చ జరుగుతోంది.
రోజా ఏమన్నారంటే…
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు నాయుడు పై తన దైన శైలిలో నగిరి ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు చేశారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయములో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే రోజా విమానాశ్రయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ 2018న జరగాల్సిన పంచాయతీ ఎన్నికలకు భయపడి పెట్టకుండా ఇప్పుడు జగన్ ని దెబ్బ తీయడానికి నిమ్మగడ్డను అడ్డం పెట్టుకొని అర్ధాంతరంగా ఎన్నికలు జరిపించారని అన్నారు. ఇప్పటికీ నిమ్మగడ్డ స్వామి భక్తి చాటుకోవాలని చూడటం విడ్డూరంగా ఉందని తెలిపారు.
ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో బెదిరింపులకు గురైన వారికి మళ్లీ నామినేషన్ అవకాశం అనడం చిత్రం గా ఉందని విమర్శించారు. ఓ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న ఇలాంటి కమిషనర్ మన దేశంలో మరొకరు లేరని అన్నారు. పనికిమాలిన, చేతగాని దద్దమ్మ కమీషనర్ నిమ్మగడ్డ అంటూ ఆమె మండిపడ్డారు. రోజా విరుచుకుపడటం చూస్తుంటే… మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు ఎదుర్కునే తర్వాతి వ్యక్తి ఆమె కావచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.