Kodali Nani : అమరావతి రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో ఏపి సీఐడి నమోదు చేసిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టు లో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిగిన న్యాయస్థానం స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సమయం దొరికనప్పుడల్లా చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో పైర్ అయ్యే పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఈ విషయంపైనా స్పందిస్తూ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేశారు.
విచారణలను ఎదుర్కొలేని చవట దద్దమ్మ, అత్యంత పిరికి వ్యక్తి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు ఒక్కడేనని వ్యాఖ్యానించారు. ఆయనను చంద్రబాబు నాయుడు అనే కంటే స్టేల బాబు అని పిలిస్తే బాగుంటుందని సెటైర్ వేశారు. సీఐడీ విచారణలో దొరికి పోతాడనే భయంలోనే స్టేల బాబు స్టే తెచ్చుకున్నారని నాని విమర్శించారు. చంద్రబాబుకు మేనేజ్మెంట్, పలుకుబడి ఉపయోగించుకుని స్టేలు తెచ్చుకోవడం ఆయనకు ఆనవాయితేనన్నారు. ఇప్పటి వరకూ ఆయన దాదాపు 30 వరకూ స్టే లు తెచ్చుకున్నారన్నారు. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద సుప్రీం కోర్టు న్యాయవాదులను తెచ్చుకుంటున్నారని అన్నారు.
కోర్టు ద్వారా స్టేలు తెచ్చుకున్నా చంద్రబాబుకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు నాని. ఇప్పటికే చంద్రబాబుకు ప్రజలు అనేక మార్లు బుద్ది చెప్పారన్నారు. జరగబోయే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో, రాబోయే పరిషత్ ఎన్నికల్లో ప్రజలు వేసే శిక్షతో చంద్రబాబు రోడ్డు మీదకు రాకుండా ఇంటికే పరిమితం చేస్తారని అన్నారు.
కాగా చంద్రబాబుపై నాని చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నుండి మాజీ మంత్రి జవహార్, ఆ పార్టీ నాయకుడు వర్ల రామయ్యలు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు కేసులో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను చదువుకోలేని నాని దానిపై మాట్లాడటం శోచనీయమని వర్ల రామయ్య అన్నారు. రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం లేని కొడాలి నాని మంత్రిగా ఉండటం ప్రజలకు సిగ్గుచేటని అన్నారు. కొడాలి సభ్యత, సంస్కారాలతో పెరగలేదని విమర్శించారు. కొడాలి నానే ఒక దద్దమ్మ అని విమర్శించిన జవహార్..నాని మంత్రి పదవిని కాపాడుకునేందుకు ఎంత దారణంగానైనా మాట్లాడతారని అన్నారు. నాని నోరు అదుపులో పెట్టుకోవాలని, చంద్రబాబుపై అవాకులు, చెవాకులు పేలడం మానుకోవాలని హితవు పలికారు.