టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో మారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని. సోమవారం నాని మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హతే చంద్రబాబుకు లేదని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల పేరుతో చంద్రబాబు పొగిండించుకున్నారని నాని విమర్శించారు. చంద్రబాబును పొడిగించుకోవడానికే మహానాడు పెట్టారన్నారు. మహానాడు వేదిక మీద బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గా కూడా గెలవని నారా లోకేష్ బొమ్మ ఎలా పెడతారు అని అన్నారు. ఎన్టీఆర్ పేరుతో నాలుగు ఓట్ల కోసమే ఈ తపనంతా అని పేర్కొన్నారు.
గతంలో టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని అన్నారు. అదే వైఎస్ఆర్ 2004 లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా ఇవ్వని పథకాలు కూడా అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చి తప్పారని అన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ అని చెప్పి అదీ చేయలేదన్నారు. చంద్రబాబు అయిదేళ్ల హయాంలో పెన్షన్లకు రూ.22వేల కోట్ల ఖర్చు చేస్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రూ.97వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. సెంటు స్థలం ఇస్తే సమాధికి సరిపోదు అంటున్న చంద్రబాబు ..14 ఏళ్లు అధికారంలో ఉండి పేదలకు స్థలాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
బీసీలకు చట్టం తెస్తానని చంద్రబాబు మోసపూరిత హామీ ఇచ్చారని అన్నారు. చంద్రబాబు వెనుక బీసీలు ఎవ్వరూ లేరని ఆయన వెంట ఉన్నది రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, పవన్ కళ్యాణ్ లేననీ, వీరెవ్వరూ బీసీలు కాదని అన్నారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే బాగుపడేది వీళ్లేనని విమర్శించారు. చంద్రబాబును ఆల్ ఫ్రీ బాబు అని ఆనాడే వైఎస్ఆర్ చెప్పారన్నారు. చంద్రబాబు దొంగ, 420, ఔరంగజేబు అని ఆనాడే ఎన్టీఆర్ అన్నారన్నారు.