సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై జనిపల్లి శ్రీనివాసరావు ( శ్రీను) కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే అతన్ని అరెస్టు చేశారు. జగన్మోహనరెడ్డి పై జరిగిన ఈ హత్యాయత్నం కేసును తర్వాత ఎన్ఐఏకి బదిలీ చేశారు. అప్పటి నుండి కోడికత్తి శ్రీను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా నే ఉన్నారు. పలు మార్లు బెయిల్ కోసం ధరఖాస్తు చేసినా లభించలేదు. సుమారు నాలుగేళ్లుగా అతను జైలులోనే ఉన్నాడు.
దీంతో నిందితుడు శ్రీను తల్లి సావిత్రి బుధవారం తమ న్యాయవాదితో తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. నేరుగా సీఎం జగన్ ను కలిసి తమ బాధను వ్యక్తం చేయాలని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే సీఎం జగన్ వేరే అపాయింట్ ల కారణంతో బీజీగా ఉండటం వల్ల నేరుగా కలవడం సాధ్యం కాదనీ, స్పందనలో వినతి పత్రం ఇచ్చి వెళ్లాలని సీఎం క్యాంప్ కార్యాలయ అధికారులు వెల్లడించారుట. అపాయింట్మెంట్ ఖరారు చేసి తర్వాత కబురు చేస్తామని అధికారులు తెలిపారని నిందితుడు శ్రీను న్యాయవాది మీడియాకు తెలిపారు.
ఎన్ఐఏ నుండి కేసు ఏపి ప్రభుత్వానికి బదిలీ చేయాలి
జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావుకు బెయిల్ వచ్చేలా నిరంభ్యంతర పత్రం ఎన్ఓసీ ఇవ్వాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో భాగంగా వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. తమ కుమారుడు జైలులో ఉండటం వల్ల పోషణ కష్టంగా మారిందని వినతి పత్రంలో శ్రీను తల్లి సావిత్ర పేర్కొంది. ఈ కేసును ఎన్ఐఏ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిందితుడు తరపు న్యాయవాది కోరారు. ఆ మేరకు సీఎం ఆదేశాలు ఇస్తే నాలుగేళ్ల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనుకు కోర్టు ద్వారా బెయిల్ లభిస్తుందని చెప్పారు. ఈ కేసులో శిక్ష పడేదే అయిదు సంవత్సరాలు అయితే ఇప్పటికే నాలుగు సంవత్సరాలుగా జైలులో ఉన్నాడని ఆయన తెలిపారు. సీఎం జగన్ మానవతాదృక్పదంతో ఆలోచించి నిందితుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రధాని మోడీ ఏపి పర్యటనకు ముహూర్తం ఖరారు .. నవంబర్ 11న విశాఖకు.. ఎందుకంటే..?