ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పై కోడికత్తితో జరిగిన దాడి కేసు విచారణ మరో సారి వాయిదా పడింది. ఈ కేసు విచారణను ఎన్ఐఏ కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఇవేళ ఎన్ఐఏ కోర్టు ముందుకు కేసు విచారణ కు రాగా.. జగన్ తరపు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఎన్ఐఏ, నిందితుడి తరపున న్యాయవాదులు వేసిన కౌంటర్ లపై న్యాయవాది వెంకటేశ్వర్లు వాదించారు. ఈ కేసులో ఫైనల్ రిపోర్టు వెయ్యనందున సామాన్యులు ఎవరైనా విచారణ ఇంకా జరుగుతూనే ఉందనుకుంటారని తెలిపారు. రాష్ట్ర పోలీసులు విడుదల చేసిన ఫ్లెక్సీ.. నిందితుడు వైసీపీ సానుభూతిపరుడు అని చెప్పేందుకు కావాలని ప్రయత్నించారన్నారు. నిందితుడి కుటుంబానికి జన్మభూమి కమిటీ ద్వారా ఇంటి స్థలం మంజూరు అయిందని కోర్టుకు తెలిపారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్, టీడీపీతో సంబంధాలు ఉన్న వ్యక్తికి విమానాశ్రయంలో ఎలా ఉద్యోగం ఇచ్చారని ప్రశ్నించారు. ఇవన్నీ అనేక అనుమానాలకు కారణం అవుతున్నాయని అన్నారు.
బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కు ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయించాలని అడిగే హక్కు ఉంటుందని ఆయన వాదనలు వినిపించారు. సాక్షం నమోదునకు అడ్వకేట్ కమిషనర్ ను నియమించాలని అభ్యర్ధించారు. కోడికత్తి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 23 రోజుల్లోనే ఎన్ ఐ ఏ అభియోగ పత్రం దాఖలు చేసిందనీ, అయితే అంత తొందరగా అభియోగం పత్రం ఎలా దాఖలు చేయగలుగుతారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 39 మంది సాక్షులను అయిదు రోజులోనే విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేశారన్నారు. ఒకే రోజున 35 మంది సాక్ష్యాలను విచారించారని, మూడు బృందాల అధికారులు ఈ విచారణ చేశారని తెలిపారు. చార్జీ షీట్ చదివితే తదుపరి దర్యాప్తు అవసరమని సాధారమ పౌరుడికి అర్ధం అవుతుందని చెప్పారు. జగన్ వ్యాంగ్మూలాన్ని అదనపు ఎస్పీ తీసుకున్నారన్నారు. నిందితుడు సోదరుడు సుబ్బరాజు తను టీడీపీ పార్టీ అభిమానిని అని చెప్పుకున్నారు అంటూ ప్రస్తావించారు. సరైన విచారణ జరగాలని కోరుకోవడం బాధితుడికి ఉన్న హక్కు అని తెలిపారు.
నిందితుడు మెడ మీద పొడవాలనుకున్నాడు అని ఎన్ ఐ ఏ తన కౌంటర్ లో పేర్కొందని, అంటే హత్య చేయాలని దీని వెనుక ఉన్న బలమైన అంశమన్నారు. దీని వెనుక కుట్ర ఉన్నట్లే కదా., ఎందుకు ఎన్ ఐఏ ఈ కుట్రను వెలికి తీయలేదని వెంకటేశ్వర్లు వాదించారు. ఎన్ఐఏ సమగ్ర విచారణ చేసింది అనడాని ఆధారంగా ఉండే వస్తువులు, ప్లెక్సిని అధికారులు న్యాయమూర్తి ముందు ప్రదర్శించారు. నిందితుడికి రెండు ఈ మెయిల్స్ ఉన్నాయనీ, వాటిని దర్యాప్తు సంస్థ పట్టించుకోలేదన్నారు. ప్రైవేటు సెక్యురిటీ తనిఖీ చేసిన తర్వాతనే రెస్టారెంట్ లోకి ఉద్యోగులను అనుమతిస్తారని హర్షవర్థన్ చెప్పారనీ, ఈ పాయింట్ ను ఎన్ఐఏ పట్టించుకోలేదని జగన్ తరపు న్యాయవాది తెలిపారు. కాగా, తమ వాదనలు వినిపించడానికి సమయం కావాలని ఎన్ఐఏ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో విచారణను ఎన్ఐఏ కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.